Karnataka : కన్నడ భగీరథుడు-ఒక్కడే 32 అడుగుల బావి తవ్వేశాడు
కర్ణాటకలోని ఒక గ్రామంలో గ్రామస్తుల దాహార్తి తీర్చటానికి ఓ వ్యక్తి 32 అడుగులు బావిని తవ్వి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాడు.
Karnataka : కర్ణాటకలోని ఒక గ్రామంలో గ్రామస్తుల దాహార్తి తీర్చటానికి ఓ వ్యక్తి 32 అడుగులు బావిని తవ్వి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాడు. కూలీలను నియమించుకునే ఆర్ధిక స్తోమత లేకపోవటంతో.. ఒక్కడే తన పొలంలో 32 అడుగులు బావి తవ్వేశాడు.
అంకోలా తాలూకాలోని మంజుగుని గ్రామానికి చెందిన మహదేవ మంకాలు కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు. గ్రామంలోని 60 ఇళ్లకు ఒక్కటే తాగునీటి బావి ఉంది. దాన్ని గ్రామ పంచాయతీ నిర్వహిస్తూ ఉంటుంది. గ్రామంలోని కొన్ని ఇళ్లల్లో బావులు ఉన్నప్పటికీ అందులో నీరు తాగటానికి పనికి రాకుండా ఉంటుంది. ఎందుకంటే గ్రామానికి సమీపంలో సముద్రం ఉండటతో వేసవిలో నీరు ఉప్పగా మారుతుంది.
దీనివల్ల ప్రతి ఏటా వేసవిలో మంచినీటి కోసం గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. దాంతో తన పొలంలోనే బావి తవ్వాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది విధించిన లాక్ డౌన్ సమయంలో 28 అడుగుల వరకు బావి తవ్వాడు. అప్పుడు ఆలోతులో నీరు పడలేదు. ఈ ఏడాది లాక్ డౌన్ ప్రకటించగానే మళ్లీ బావి మరింత లోతుగా తవ్వటం మొదలెట్టాడు. ఈసారి మరో నాలుగు అడుగులు తవ్వగానే నీరు పడింది. ఇప్పడు ఈ బావి నీటితోనే గ్రామ ప్రజలు దాహార్తిని తీర్చుకుంటున్నారు.