Karnataka Politics : కొనసాగుతున్న హైడ్రామా..యడియూరప్పపై నడ్డా ప్రశంసలు
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్పనే ఇకపై కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Karnataka Politics కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్పనే ఇకపై కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం పదవి నుంచి తాను వైదొలగడంపై యడియూరప్ప స్వయంగా సంకేతాలు ఇస్తున్న వేళ ఈ అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. తన ఉద్వాసనపై అధిష్ఠానం నుంచి త్వరలోనే స్పష్టత వస్తుందని, ఏ ఆదేశాలు వచ్చినా పాటిస్తానని యడియూరప్ప ఇప్పటికే ప్రకటించగా…బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనికి భిన్నంగా స్పందించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం గోవాకు వెళ్లిన జేపీ నడ్డా.. ఇవాళ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక సీఎం యడియూరప్పను మెచ్చుకున్నారు. యడియూరప్ప సమర్థంగా పని చేశారని పేర్కొన్నారు. ఆయన ప్రతి అంశాన్ని తన పద్ధతిలో పరిష్కరిస్తున్నారని కితాబిచ్చారు. కర్ణాటకలో నాయకత్వ సమస్య లేదని, అది మీ మీడియా ఫీలింగ్ మాత్రమేనని,తమకు మాత్రం అలాంటి ఫీలింగ్ లేదని మీడియాను ఉద్దేశించి నడ్డా వ్యాఖ్యానించారు.
ఈ సాయంత్రానికి హైకమాండ్ ఆదేశాలు వస్తే అందుకు తగినట్టుగా తన నిర్ణయం ఉంటుందని కొన్ని గంటల క్రితం యడియూరప్ప వ్యాఖ్యానించిన నేపథ్యంలో జేపీ నడ్డా తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి సోమవారానికి రెండేళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా విధానసభ సమావేశాల హాల్లో పార్టీ నేతలకు యడియూరప్ప విందు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన వైదొలుగుతారనే ఊహాగానాల మధ్య ఈ కార్యక్రమం చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది.