Kashi Mosque Row : కాశీలో మసీదు సర్వేపై అలహాబాద్ హైకోర్టు స్టే
త్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేస్తున్న సర్వేపై అలహాబాద్ హైకోర్టు
Kashi Mosque Row ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేస్తున్న సర్వేపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. సర్వేకు అనుకూలంగా వారణాసి దిగువకోర్టు ఇచ్చిన అనుమతులను నిలిపివేస్తూ.. గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
వారణాసిలో కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదు ఉంది. కాశీ విశ్వనాథ్ ఆలయం- జ్ఞానవాపీ మసీదు స్థల వివాదం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఆలయం కూల్చి మసీదు నిర్మించారని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం 2019 డిసెంబర్లో స్థానిక లాయర్ వీఎస్ రాస్తోగి.. వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మొఘల్ రాజు ఔరంగాజేబ్ 1664లో 2వేల ఏళ్ల నాటి కాశీ విశ్వనాథ్ ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చివేసి మసీదును నిర్మించాడని పిటిషన్ లో పేర్కొన్నారు. భారత సర్వే విభాగం(ASI)తో మసీదు స్థలాన్ని మొత్తం సర్వే చేయాలని కోరారు. అయితే.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమ్ ఇంతెజామియా మసీదు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ క్రమంలో జ్ఞానవాపీ మాసీదు కాంప్లెక్స్ ఉన్న ప్రాంతంలో ఇంతకు ముందు ఏదైనా ఆలయం ఉండేదా అని తెలుసుకునేందుకు వారణాసి ఫాస్ట్రాక్ కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 8న సర్వే చేసేందుకు ASI కి అనుమతించింది. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వారణాసి ఫాస్ట్రాక్ కోర్టు ఇచ్చిన అనుమతులను సవాలు చేస్తూ.. ఉత్తర్ ప్రదేశ్ సునీ వక్ఫ్ బోర్డ్ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు.. పిటిషనర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు విన్న తర్వాత సర్వేపై స్టే విధించింది. జస్టిస్ ప్రకాశ్ పాడియా నేతృత్వంలోని ధర్మాసం ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసింది.