ఆ ఘటనతోనే ఉగ్రవాదిగా..సూసైడ్ బాంబర్ అదిల్ తల్లిదండ్రులు
భారత బలగాలు మూడేళ్ల క్రితం తన కొడుకుని చావగొట్టడం వల్లే అతడు ఉగ్రసంస్థ జైషే మహమద్లో చేరాడని సూసైడ్ బాంబర్, అదిల్ అహ్మద్ దార్(20) తల్లిదండ్రులు తెలిపారు. గురువారం(ఫిబ్రవరి-14,2019) పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లెథిపొరా గ్రామానికి చెందిన అదిల్ ఆత్మహుతికి దాడికి తెగబడి 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టబెట్టుకున్న విషయం తెలిసిందే. ఓ స్కార్పియో SUVలో 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (IED) నింపుకొని జవాన్ల కాన్వాయ్ని టార్గెట్ చేసుకొని ఓ సీఆర్పీఎఫ్ వ్యాన్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు.
ఈ దాడిపై దుండగుడు అదిల్ అహ్మద్ దార్ తల్లిదండ్రులు మాట్లాడుతూ…2016లో అదిల్ అహ్మద్ దార్, అతని స్నేహితులు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా.. భారత సైనికులు అడ్డుకొని చావగొట్టారని, వేధించారని, ఈ ఘటనతోనే అదిల్ ఉగ్రవాద గ్రూప్ల పట్ల ఆకర్షితుడయ్యాడని,అప్పటి నుంచి భారత సైనికులపై కోపం పెంచుకున్నాడని అతని తల్లి ఫహమీదా తెలిపింది.
తన కొడుకు ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదని, ఈ దాడి వ్యూహం తమకు తెలియదని, పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకున్న బాధే తమకు ఉందని అదిల్ అహ్మద్ దార్ తండ్రి గులామ్ హసాన్ దార్ తెలిపాడు. 2018, మార్చి 19 నుంచి అదిల్ పని చేసే చోటు నుంచి అదృశ్యమయ్యాడని, అతని జాడ కోసం 3 నెలలు ప్రయత్నించి ఆశ చాలించుకున్నామన్నారు.
తన కొడుకు మరణానికి దేశంలోని రాజకీయనాయకులే కారణమని, కశ్మీర్ సమస్యపై తేల్చకుండా నాన్చుతున్నారని గులామ్ అన్నాడు. చర్చల ద్వారా కాశ్మీర్ సమస్య పరిష్కరించి ఉండాల్సిందన్నారు. తన కొడుకైనా, జవాన్లు అయినా ఇక్కడ పేద వాళ్ల బిడ్డలు చనిపోయారని గులామ్ వాపోయాడు.
Read Also: అమర జవాన్ కూతురి భావోద్వేగం : నీ త్యాగానికి నా సెల్యూట్ డాడీ
Read Also: వీడ్ని ఏం చేసినా పాపం లేదు : ఉగ్రదాడిని సమర్థించిన విద్యార్థి