కశ్మీర్ ప్రజల వాట్సప్ ఖాతాలు తొలగింపు
జమ్మూ కశ్మీర్ ప్రజలకు చెందిన వాట్సప్ ఖాతాలను ఆ సంస్ధ తొలగించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా గత నాలుగు నెలలుగా అక్కడ ఇంటర్నెట్ సేవలనుకేంద్రం నిలిపి వేసింది. వాట్సాప్ కంపెనీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ ఖాతా అయినా 120 రోజుల వరకు యాక్టివ్గా లేకపోతే ఆ ఖాతాకు సంబంధించిన డాటా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అప్పటి వరకు ఏదైనా గ్రూపులో సభ్యులుగా ఉంటే డియాక్టివేట్ అయిపోతుంది. ఈ పరిస్ధితుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీలకు తమ ప్రాంతంలోని స్నేహితులు, బంధువులు ఆయా గ్రూపుల నుంచి తప్పుకున్నట్లు మెసేజ్ లు వచ్చాయి జమ్మూ కశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలునిలిపి వేసి బుధవారం డిసెంబర్ 4వ తేదీకి నాలుగు నెలలు పూర్తయ్యింది. దీంతో ఆ మెసేజ్ లు వచ్చాయి.
జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్ 370ని కేంద్రం ఆగస్టు5,2019 న రద్దుచేసింది.కేంద్రం నిర్ణయంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయినట్టుయ్యింది. అలాగే జమ్మూ కశ్మీర్ను రెండుగా విభజించింది. జమ్మూ కశ్మీర్కు అసెంబ్లీతోపాటు కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ను ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ ప్రతిపాదనలు రూపొందించింది. చట్ట సభలేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ను గుర్తించింది.ఈ నేపధ్యంలో అక్కడ శాంతిభధ్రతల దృష్ట్యా అప్పటినుంచి కేంద్రం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దీంతో వాట్సప్ ఖాతాలన్నీ తొలగించబడ్డాయి.
ఈవిషయమై వాట్సప్ సంస్ధ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ‘వాట్సాప్ అనేది గ్లోబల్ సంస్థ. ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు. నాలుగు నెలల పరిమితి అనేది కంపెనీ నియమం. ఖాతాదారుల డేటా భద్రత కోసం పరిమితిని ఎక్కువ కాలం ఉంచవద్దని నియమంగా పెట్టుకున్నాం. ఇప్పుడు భౌగోళికత ఆధారంగా కశ్మీర్ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోం. ఇంటర్నెట్ పునరుద్ధరించినప్పుడు వారు తిరిగి తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలి. అయితే అంతకు ముందు వరకు ఉన్న డేటా మాత్రం వారికి అందుబాటులో ఉండద’ని స్పష్టం చేశారు. కాగా, భారత్లో వాట్సాప్ ఖాతాదారుల సంఖ్య దాదాపు 40 కోట్లు. ఇందులో జమ్ము కశ్మీరీల ఖాతాలు సుమారుగా 15 లక్షల వరకు ఉండవచ్చని ఒక అంచనా.