కేరళలో నెల రోజులపాటు 144 సెక్షన్
Kerala imposes Section 144 కేరళలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులను కట్టడి చేసేందుకు లాక్డౌన్ అస్త్రాన్ని ఎంచుకుంది పినరయి విజయన్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ను విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వం విధించిన తాజా నిబంధనలు అక్టోబర్ 3 ఉదయం 9గంటల నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు సెక్షన్-144 అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఒకేచోట ఐదుగురికంటే ఎక్కువ మంది సమావేశమవడం నిషేధం. అయితే.. శుభకార్యాలు, అంత్యక్రియలు మొదలగువాటికి సడలింపు ఉంటుంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉండనున్నాయి..
కేరళలో గురువారం ఒక్కరోజే 8 వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. బాధితుల సంఖ్య 2లక్షల మార్కును దాటింది. ఇప్పటివరకు కేరళలో 771 కరోనా మరణాలు నమోదయ్యాయి.