లక్కున్నోడు : లాటరీ టికెట్లు అమ్ముకొనే వ్యక్తికి రూ. 12 కోట్లు
kerala lottery seller : లాటరీ టిక్కెట్లు అమ్ముకునే వ్యక్తికి జాక్పాట్ తగిలింది. కాళ్లకు చెప్పులరిగేలా తిరిగి లాటరీ టిక్కెట్టు అమ్మితే రాని అదృష్టం.. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన టిక్కెట్టుతో వచ్చింది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్-న్యూ ఇయర్ బంపర్ లక్కీ లాటరీలో ఏకంగా రూ. 12 కోట్ల నగదు గెలుచుకున్నాడు షరాఫుద్దీన్ అనే వ్యక్తి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కేరళ ప్రభుత్వం 12 కోట్ల రూపాయల ప్రైజ్మనీతో బంపర్ ఇష్యూ పేరిట లాటరీని తెచ్చింది.
నెల రోజులు గడిచినా చాలా టిక్కెట్లు షరాఫుద్దీన్ అమ్ముడుకాకుండా ఉండిపోయాయి. అయితే ఇటీవల ప్రకటించిన లాటరీ ఫలితాల్లో షరాపుద్దీన్ దగ్గర ఉన్న ఓ లాటరీ టిక్కెట్ట్కు బంపర్ ప్రైజ్ వచ్చింది. దీంతో లాటరీ డైరెక్టరేట్ కి వెళ్లి బంపర్ ప్రైజ్మనీ చెక్కును అందుకున్నాడు. ఏజెంట్ కమీషన్, ట్యాక్సులు పోను 7 కోట్ల 50 లక్షల రూపాయల చెక్కును అందుకున్నాడు. ఈ డబ్బుతో అప్పులన్నీ తీర్చి.. మంచి ఇళ్లు కట్టుకుని.. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నట్టు షరాఫుద్దీన్ తెలిపారు.
తమిళనాడులోని తెన్కాశీ జిల్లాకు చెందిన షరాఫుద్దీన్… మొదట బతుకుదెరువు కోసం రియాద్ వెళ్లాడు. అక్కడ తొమ్మిదేళ్లపాటు కాయకష్టం చేశాడు. కష్టం తప్ప కాసులు మిగలకపోవడంతో ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఆరుగురు సభ్యులు ఉన్న ఉమ్మడి కుటుంబంతో కేరళలోని కొల్లాం జిల్లాలోన అరణ్యకావుకి మకాం మార్చాడు. ప్రభుత్వ పొరంబోకు స్థలంలో చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు.