Rahul Gandhi : కేరళలోని రాహుల్ గాంధీ ఆఫీసుపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దాడి
కేరళలోని వాయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయంపై శుక్రవారం మధ్యహ్నం సీపీఐ(ఎం) విద్యార్ధి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ఆప్ ఇండియా SFI కు చెందిన సభ్యులు దాడి చేశారు.
Rahul Gandhi : కేరళలోని వాయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయంపై శుక్రవారం మధ్యహ్నం సీపీఐ(ఎం) విద్యార్ధి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ఆప్ ఇండియా SFI కు చెందిన సభ్యులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళలోని ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాహుల్ గాంధీ కార్యాలయంలోకి ప్రవేశించిన సుమారు 80 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేయటంతో పాటు కార్యాలయంలో ఉన్న సిబ్బందిపై దాడి చేశారు. వీరంతా బలవంతంగా లోపలికి ప్రవేశించి సిబ్బందిని దారుణంగా కొట్టారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఈ దాడికి కారణం ఏమిటో తమకు తెలియదన్నారు.
కొండ ప్రాంతాలలోని అడవుల చుట్టూ బఫర్ జోన్ల ఏర్పాటు విషయంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకోకపోవటానికి నిరసనగా విద్యార్ధి సంఘాలు దాడి చేసినట్లు ప్రాధమిక సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే దీనితో రాహుల్ గాంధీకి సంబంధం ఏమిటో అన్నది అర్థం కావడం లేదని వేణు గోపాల్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేరళ సీఎం మాత్రమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
ఈ అంశంపై జోక్యం చేసుకోవాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్తో పాటు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాసినట్లు తెలిపారు. కాగా, ఇది పక్కా ప్రణాళికతో పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని వేణుగోపాల్ ఆరోపించారు. అధికార సీపీఐ ప్రమేయంతోనే ముందస్తు కుట్రలో భాగంగానే రాహుల్ కార్యాలయంపై ఎస్ఎఫ్ఐ దాడి చేసిందని విమర్శించారు.
Ghastly attack by SFI goons at Rahul Gandhi’s MP Office at Wayanad. It is lawlessness and goondaism. CPM has turned into an organised mafia. Strongly Condemning the attack. pic.twitter.com/KzUdELEzdh
— V D Satheesan (@vdsatheesan) June 24, 2022
రాహుల్ గాంధీని ఈడీ గత ఐదు రోజులుగా ప్రశ్నిస్తోందని, ఇలాంటి తరుణంలో కేరళలోని అధికార సీపీఎం ప్రభుత్వం మోదీ మాదిరిగా ఎందుకు వ్యవహరిస్తున్నదో తమకు అర్థం కావడం లేదన్నారు. సీతారామ్ ఏచూరి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
మరోవైపు ఈ సంఘటనకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు కాల్ పేటలో నిరసనకు దిగటంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారీగా అక్కడ పోలీస్లను మోహరించారు. దాడి చేసిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు సీసీఎం కూడా ఈ దాడిని ఖండించింది.
Also Read : College Admissions : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి జూన్ 25 నుండి దరఖాస్తుల ఆహ్వానం