5 states poll : ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన సినీప్రముఖులు
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మూడో విడతగా పశ్చిమ బెంగాల్ లో 31, అసోంలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
all poll-bound states : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7గంటలకు ఓటింగ్ మొదలైంది. రాత్రి ఏడు గంటలవరకు పోలింగ్ సాగనుంది. 234 స్థానాలున్న తమిళనాడుకు, 140 స్థానాలున్న కేరళకు, 30 స్థానాలున్న పుదుచ్చేరికి ఒకేదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. అసోంలో ఆఖరి విడత, పశ్చిమ బెంగాల్లో మూడో విడత ఓటింగ్ సాగుతోంది. బెంగాల్లో 31 స్థానాలకు, అసోంలో 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో మొత్తం 6.6కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 88వేల 937 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు.
ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు లక్షా 58వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో కమల్హాసన్, దినకరన్ నేతృత్వంలోని కూటములు ఎంత మేర ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. పుదుచ్చేరిలో 10లక్షల 4వేల 197మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 4.7లక్షల మంది పురుషులు, 5.3లక్షల మంది మహిళా ఓటర్లు, 116 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. కేరళలో 140 స్థానాలకు 957మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్తో పాటు బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. మొత్తంగా 2.7 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1.4 కోట్లు మహిళలు, 1.3కోట్ల మంది పురుషులు ఉన్నారు. బెంగాల్లో 31 స్థానాల్లో మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా స్థానాల్లో 205మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు 618 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. అస్సాంలో చివరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో దశలో ఇక్కడ 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 337మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
వీరిలో 25మంది మహిళలే ఉన్నారు. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా.. 2.3కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మూడో దశలో 79లక్షల 19వేల 641 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం తరలివస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైన అరగంటలోపే ప్రముఖులు అనేకమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ స్టెల్లామారిస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
ప్రముఖ హీరో, మక్కల్ మయ్యమ్ నీది అధ్యక్షులు కమల్ హాసన్ చెన్నై ఎల్దమ్స్ రోడ్డులోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కమల్ కుమార్తెలు శృతిహాసన్, అక్షర హాసన్ చెన్నైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కందనూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెట్రో మ్యాన్ శ్రీధరన్ కేరళలో ఓటు వేశారు. సినీ నటుడు సూర్య, ఆయన తమ్ముడు నటుడు కార్తీ ఓటు వేశారు. తిరువాన్మయూర్లో నటుడు అజిత్ ఓటు వేశారు.