పేపర్ కప్ తో టీ, కాఫీలు తాగితే ప్రమాదం..పరిశోధకుల హెచ్చరిక
Kharagpur IIT warn paper cups uesed : ప్లాస్టిక్ కప్పులు వాడితే ప్రమాదం అనే విషయం అందరికీ తెలిసిందే.కానీ పేపర్ కప్పు కూడా ప్రమాదమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పేపర్ కప్ లతో టీ కాఫీలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఖరగ్పూర్ ఐఐటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఒకసారి వాడిపారేసే (డిస్పోజబుల్’ పేపర్ కప్పుల్లో 100 మిల్లీలీటర్ల చొప్పున మూడుసార్లు టీ తాగితే 75 వేల అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోనికి వెళతాయని అవి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయని తెలిపారు.
80-90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి కలిగిన 100 మిల్లీలీటర్ల ద్రవ పదార్థం ద్వారా దాదాపు 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కణాలు మనలోకి చేరతాయని అన్నారు. దీంతో క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు శరరీంలోకి వెళ్తాయని తెలిపారు.
పేపర్ కప్పులు హైడ్రోఫోబిక్ ఫిల్మ్ సన్నటి పొరతో తయారు చేస్తారు. కాగా ఇందులోనూ పాలీ ఇథలీన్ అంటే ప్లాస్టిక్ ఉంటుంది. అలా తయారుచేసిన పేపర్ కప్పుల్లో టీ (వేడి వేడి ద్రవాలు) పోసినప్పుడు కేవలం ఆ పేపర్లోని మైక్రోప్లాస్టిక్ కణాలతో పాటు ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోయి శరీరంలోకి వెళ్తున్నాయని చెప్పారు.
టీ లేక ఇతర ఏ వేడి ద్రవం పోసినా 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్ లేయర్లో చర్య జరుగుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయెల్ తెలిపారు. 85-90 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండే 100 ఎంఎల్ వేడి ద్రవంలోకి పేపర్ కప్పు నుంచి 25 వేల మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని అధ్యయనంలో రుజువైందని తెలిపారు.
ఈ రేణువుల్లో అయాన్లతో పాటు క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ఉంటాయని ఆమె వివరించారు. వీటి వల్ల అనేక రకాలైన క్యాన్సర్లు వస్తాయని కాబట్టి సాధ్యమైన మేరకు పేపర్ కప్పులు కూడా వాడకుండా ఉంటే చాలా చాలా మంచిదని సూచిస్తున్నారు.