బెంగాల్ లో టెన్షన్…బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 8, 2020 / 03:00 PM IST
బెంగాల్ లో టెన్షన్…బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్

Kolkata: Cops resort to lathicharge as BJP marches వెస్ట్ బంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా నాయకులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. అధికార ప్రభుత్వం అవినీతి, గూండా రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆందోళనకారులు రహదారులపైకి వచ్చారు.’చలో సచివాలయం’ అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.


కోల్ కతాలో బెంగాల్‌ సచివాలయం ‘నవన్నా’ను ముట్టడించేందుకు వెళ్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కోల్‌కతా, హౌరా నుంచి వేలాది మంది బీజేపీ కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ చేశారు. బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఘర్షణల్లో బీజేపీ ఎంపీ జ్యోతిర్మయి సింగ్‌ మహతో, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు బెనర్జీ, పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.



భాజపా ర్యాలీకి అధికార తృణమూల్‌ ప్రభుత్వం బుధవారం అనుమతి నిరాకరించియన విషయం తెలిసిందే. కొవిడ్‌ కారణంగా ఎలాంటి ఆందోళనలు చేయొద్దని, ఒకవేళ ర్యాలీలు చేయాల్సి వస్తే కేవలం 100 మంది మాత్రమే ఉండాలని సూచించింది. అయినప్పటికీ బీజేపీ ఆందోళన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు శానిటైజేషన్‌ నిమిత్తం సచివాలయాన్ని నేటి నుంచి రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


కాగా, పోలీసులు తమపై లాఠీఛార్జ్ చేయడాన్ని భాజపా శ్రేణులు తప్పుబట్టాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శాంతియుతంగా చేపట్టిన నిరసనలను మమతా సర్కార్ హింసాత్మకంగా మార్చాలని చూస్తోందని మండిపడ్డాయి. పోలీసులు, గూండాలు కలిసి తమపైకి రాళ్లు రువ్వారని భాజపా నేత కైలాశ్ విజయవార్గియా ఆరోపించారు.

ఆందోళనల నేపథ్యంలో కోల్​కతాలో భారీగా భద్రత బలగాలను మోహరించారు అధికారులు. నిరసనకారులను అడ్డుకునేందుకు రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్​ వాహనాలను మోహరించారు.