కృష్ణుడు ఇవాళే జైలులో పుట్టాడు..నీకు బెయిల్ కావాలా? : జోక్ వేసిన చీఫ్ జస్టిస్
మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అన్న విషయం తెలిసిందే. అయితే,కృష్ణుడు జైలులో ఇవాళే పుట్టాడని, ఈ రోజునే నీకు బెయిల్ కావాలా అంటూ ఓ కేసు తీర్పు సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే జోకేశారు. చీఫ్ జస్టిస్ జోక్ కు అందరూ కాసేపు నవ్వుకున్నారు.
మహారాష్ట్రకు చెందిన ధర్మేంద్ర వాల్వే ఓ మర్డర్ కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. అయితే అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ అభ్యర్థనను సీజే విచారించారు. ధర్మేంద్రకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు.
ఆ సమయంలో చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. నీకు బెయిల్ కావాలా జైలు కావాలా.. శ్రీకృష్ణ భగవానుడు ఇవాళే జైలులో పుట్టారని, నీకు జైలు విడిచి వెళ్లాలని ఉందా అంటూ చమత్కరించారు. అపుడు పిటిషనర్ తరపున న్యాయవాది తమకు బెయిల్ కావాలంటూ అభ్యర్థించారు. గుడ్.. నీకు మతపరమైన పట్టింపులు లేవనట్లుగా సీజీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన ధర్మేంద్ర వాల్వేతో పాటు అయిదు మంది పార్టీ కార్యకర్తలపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. 1994లో బీజేపీ అభ్యర్థిని హతమార్చిన కేసులో వాళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ట్రయల్ కోర్టు వారిని ఆ కేసులో దోషులుగా తేల్చింది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన సీజే.. 25వేల పూచీకత్తుపై ధర్మేంద్రకు బెయిల్ మంజూరు చేశారు.