Lockdown : ముంబైలో కరోనా తగ్గుముఖం…లాక్ డౌన్ ఫలితం
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా తగ్గుముఖం పడుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయడంతో కేసులు తగ్గుతున్నాయని తెలుస్తోంది.
Mumbai : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా తగ్గుముఖం పడుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయడంతో కేసులు తగ్గుతున్నాయని తెలుస్తోంది. ఆదివారం కొత్తగా 3,629 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కరోనా సోకిన వారి సంఖ్య 3 నుంచి 4 వేలలోపు మాత్రమే నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.
గత 24 గంటల్లో 79 మంది చనిపోయారు. మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6 లక్షల 55 వేల 997గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 13,294గా ఉంది. ఆదివారం ఒక్కరోజే 51,356 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే…కొత్తగా 56 వేల 647 కోవిడ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 47,22,401కి చేరుకుంది.
మరోవైపు…2021, మే 03వ తేదీ సోమవారం ముంబైలో కరోనా టీకాల కోసం 45 ఏళ్లు పైబడిన వారు రావొద్దని బీఎంసీ సూచించింది. కేవలం ఐదు కేంద్రాల్లో కేవలం 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగలవారికే వ్యాక్సినేషన్ ఉంటుందని పేర్కొంది.