క్లాస్ రూమ్ లో టీచర్ హత్య : హడలిపోయిన విద్యార్ధులు

  • Published By: veegamteam ,Published On : February 22, 2019 / 11:08 AM IST
క్లాస్ రూమ్ లో టీచర్ హత్య : హడలిపోయిన విద్యార్ధులు

చెన్నై : ఐదవ తరగతి క్లాస్ రూమ్ లో టీచర్ విద్యార్ధులకు లెసన్ చెబుతోంది. హఠాత్తుగా ఓ వ్యక్తి కత్తితో ప్రత్యక్షమయ్యాడు. ఎవరు..ఎందుకొచ్చాడని అనుకునేలోపే టీచర్ పై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇష్టానుసారంగా కత్తితో దాడిచేయటంతో 23 ఏళ్ల టీచర్ రమ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందింది. ఈ ఘటనతో క్లాస్ రూమ్ అంతా రక్తసిక్తంగా మారిపోయింది. అంతా క్షణాలలో జరిగిపోవటంతో కళ్లముందే  అంతటి దారుణం జరగటంతో  విద్యార్థులు భయంతో వణికిపోయారు. వెంటనే పరుగు పరుగున వెళ్లి ప్రిన్సిపాల్ తో చెప్పారు. దీంతో ప్రిన్సిపల్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకి పంపించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని  రాజశేఖర్ గా గుర్తించారు.

ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైకి 200 కి.మీ. దూరంలోని కడలూరు జిల్లాలో శుక్రవారం (ఫిబ్రవరి22) చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..గాయత్రి మెట్రిక్యులేషన్‌ స్కూల్లో మ్యాథ్య్ టీచర్ గా పని చేస్తున్న రమ్య..రాజశేఖర్ కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అని..ఆరు నెలల క్రితం రమ్యతో తన వివాహం జరిపించాలని ఆమె తల్లిదండ్రులను అతడు కోరాడు. ఇందుకు రమ్య, అతని  తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. అప్పట్నుంచి కక్ష పెంచుకున్న రాజశేఖర్‌.. తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో రమ్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరికి రాజశేఖర్‌ మేసేజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.