అత్యాచార బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇచ్చేస్తారా? హైకోర్టుకు సుప్రీం అక్షింతలు
MP HC order directing accused to tie Rakhi on victim condition for bail : మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి ఓ యువతిని అత్యాచారం చేశాడు. నేరం నిరూపణ అయి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దానికి హైకోర్టు అత్యాచార దోషికి బెయిల్ ఇవ్వాలి అంటూకొన్ని షరతులు విధించింది. ఈ షరతులు ఏమిటంటే..ఏ యువతినైతే అత్యాచారంచేశాడో..ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇస్తామని చెప్పింది.
ఇంకేముంది..అదో పెద్ద విషయమా? అంటూ దోషి ఓకే అన్నాడు. దీంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసేసింది. బెయిల్ ఆర్డర్ కూడా ఇచ్చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మహిళా లాయర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యాచారం చేసి రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇచ్చేస్తారా? అని ప్రశ్నిస్తూ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ను సవాలు చేశారు. ఈ విషయంపై తొమ్మిదిమంది మహిళా లాయర్లు సుప్రీంకోర్టులో ఏప్రిల్ సవాలు చేశారు.
ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ను గురువారం (మార్చి 18,2021) కొట్టివేసింది. మూస ధోరణులకు దారితీసే వ్యాఖ్యలు జడ్జీలు చేయకపోవడమే మంచిది అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి అంశాల్లో న్యాయమూర్తులు, లాయర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనుసరించడానికి ఓ మాడ్యూల్ను రూపొందించాల్సిందిగా జ్యూడీషియల్ అకాడమీకి ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు తెలిపింది.
ఈ కేసులో అసలేం జరిగింది? పూర్వాపరాలేంటీ?
మధ్యప్రదేశ్ లో అత్యాచారం కేసులో ఉజ్జయిని జైలలో శిక్ష అనుభవిస్తున్నవిక్రమ్ బాగ్రీ అనే వ్యక్తి 2020 ఏప్రిల్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు 2020 జులై 30న అతనికి బెయిల్ మంజూరు చేసింది.
అయితే దీనికి కొన్ని షరతులు విధించింది. అందులో ఒకటి ఏంటంటే.. రక్షాబంధన్ రోజు ఆ బాధిత యువతి ఇంటికి వెళ్లి ఆమెతో రాఖీ కట్టించుకొని జీవితాంతం ఆమె రక్షణగా ఉంటానని హామీ ఇవ్వడం. అలా ఆమెకు భరోసా ఇచ్చి రూ.11 వేలు ఆమెకు ఇవ్వాలి. అలాగే ఆమెకు పుట్టిన కొడుకుకు కొత్త బట్టలు, స్వీట్లు కోసం రూ.5 వేలు ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ 9 మంది మహిళా లాయర్లు సుప్రీంకు వెళ్లారు. ఈ పిటీషన్ విచారించి సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు అక్షింతలు వేసింది. అలాగే ఇటువంటి కేసుల్లో న్యాయమూర్తులు, లాయర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనుసరించడానికి ఓ మాడ్యూల్ను రూపొందించాల్సిందిగా జ్యూడీషియల్ అకాడమీకి ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు తెలిపింది.