ఆ స్వామి గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు

ఆ స్వామి గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు

తమిళనాడులోని మధురైలో ఉన్న మునియాండి స్వామి గుడిలో బిర్యానీనే ప్రసాదం. మొక్కులు తీర్చుకుని బిర్యానీ తినేసి వెళ్లిపోతుంటారు భక్తులు. వినడానికే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. ప్రసాదమంటే లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి ఇవే గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకోకుండా ఉండరు మరి. 

ఈ ప్రసాదం ఆనవాయితీ ఇటీవల మొదలైంది కాదు. రాష్ట్రంలోని మధురై ప్రాంతంలో ఉన్న మునియాండి స్వామి ఆలయానికి మరెక్కడా లేనంత విశిష్టత ఉంది. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఏటా జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. 

వారి కోసం వెయ్యి కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఈ రెండు రోజులు అదే ప్రసాదంగా అందిస్తారు. ప్రసాదం కదా.. ఏ కొంచెమో పెడతారనుకోవద్దు.. ఆ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉండటం గమనార్హం.

పూజలు జరుగుతుండగా పక్కన వాయిద్యాలు మోగుతుంటుంటే మరో వైపు బిర్యానీ వండుతున్న వీడియోను ఇంగ్లీషు మీడియా పబ్లిష్ చేసింది. కొందరు అక్కడే తింటుంటే మరి కొందరు ప్యాకింగ్ లో బిజీ అయిపోయారు.