Uddhav Thackeray To Meet PM : ప్రధానితో ఉద్దవ్ ఠాక్రే భేటీ!
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఢిల్లీలో కలవనున్నారు.
Uddhav Thackeray To Meet PM మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఢిల్లీలో కలవనున్నారు. సీఎం నేతృత్వంలో ఓ బృందం మంగళవారం ఢిల్లీలో ప్రధానిని కలిసి మరాఠా రిజర్వేషన్,ఓబీసీ రిజర్వేషన్ మరియు తౌక్టే తుఫాన్ సహాయ చర్యలు సహా పలు అంశాలపై చర్చిస్తుందని సోమవారం మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు. సీఎం నేృత్వంలోని బృందంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు, ఎడ్యుకేషన్ మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో 12-13శాతం వరకు రిజర్వేషన్లు పొందగలిగేలా మహారాష్ట్రలోని మరాఠా కమ్యూనిటీని SEBC(సామాజిక మరియు విద్యా వెనుకబాటు తరగతి)గా ప్రకటించాలని కోరుతూ గత నెలలో ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రధానమంత్రికి ఉద్దవ్ ఠాక్రే లేఖ రాసిన విషయం తెలిసిందే. మే-31న శివసేన పార్టీ పత్రిక సామ్నా.. తన సంపాదకీయంలో మరాఠా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో పోరాటం జరుగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు ఉద్దవ్ ఠాక్రే..ప్రధాని మోడీని కలవనుండటం చర్చనీయాంశంగా మారింది.
కాగా, మరాఠా సమాజానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలలో రిజర్వేషన్ల కోటాను కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టా మే-5,2021న ఐదుగురు సభ్యుల నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇది ఇంతకు ముందు విధించిన 50 శాతం పరిమితిని మించిందని సుప్రీంకోర్టు పేర్కొంది. మరాఠా కమ్యూనిటీని SEBCగా గుర్తించలేమని సుప్రీం కోర్టు సృష్టం చేసింది.