మహారాష్ట్రలో “ఆర్థిక ప్రభావం లేని” లాక్ డౌన్ : ఉద్దవ్ ఠాక్రే
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు.
Maharashtra మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సూచన మేరకు ఆర్థికరంగంపై అధిక ప్రభావం పడకుండా లాక్డౌన్ను ఎలా విధించాలో కార్యచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేష్ తోపె సైతం పాల్గొన్నారు. కొవిడ్-19 రోగుల కోసం పడకల సామర్థ్యం, ఆక్సిజన్, వైద్య సామాగ్రి తదితర అంశాలపై అధికారులతో సీఎం ఉద్దవ్ ఠాక్రే చర్చించారు.ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనాను అరికట్టాలంటే కఠినమైన లాక్డౌన్ విధించాలని కోవిడ్-19 టాస్క్ ఫోర్స్.. ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సూచన మేరకు ఆర్థికరంగంపై అధిక ప్రభావం పడకుండా లాక్డౌన్ను ఎలా విధించాలో పూర్తి కార్యచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. లాక్ డౌన్ విధించాక ప్రజల్లో ఎలాంటి గందరగోళం ఉండొద్దని సీఎం సూచించారు.
కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రోజూ 30వేలకు పైగా కొత్తగా కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 35,726 కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రంలో 144 సెక్షన్ విధించింది ప్రభుత్వం. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించింది. పండుగలు, శుభకార్యాలతో పాటు రాజకీయ, మతపరమైన ర్యాలీలు, కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేసింది.