మిషన్ బిగిన్ ఎగైన్ : మహారాష్ట్రలో 51వేలకు చేరిన కరోనా మరణాలు..లాక్ డౌన్ పొడిగింపు

Maharashtra govt మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 51 వేలకు చేరింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు దాదాపు మూడు వేల పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,21,184కు, మరణాల సంఖ్య 51,000కు చేరింది. వైరస్ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,25,800కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43,147 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ఫిబ్రవరి 28వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రానికి కరోనా ముప్పు పొంచి ఉన్నదని, అది వ్యాపించకుండా నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ సర్క్యులర్లో పేర్కొంది.
మిషన్ బిగిన్ ఎగైన్ పేరుతో దశలవారీగా ఆంక్షలను మార్గదర్శకాలను సడలిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, కేరళతోపాటు మహారాష్ట్రలోనూ ఇప్పటికి కూడా కేసులు ఎక్కువవుతున్నాయని కేంద్రం ప్రకటించింది.