Major boost for IAF : ఏప్రిల్ లో భారత్ కు మరో 10 రాఫెల్ ఫైటర్ జెట్స్
భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే అత్యాధునికమైన రాఫెల్ యుద్ద విమానాలు వాయుసేనను శతృదుర్భేద్యంగా మార్చాయి. తాజాగా మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు రానున్నాయి.
Major boost for IAF భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే అత్యాధునికమైన రాఫెల్ యుద్ద విమానాలు వాయుసేనను శతృదుర్భేద్యంగా మార్చాయి. తాజాగా మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు రానున్నాయి. ఫ్రాన్స్ నుంచి రానున్న రెండు, మూడు రోజుల్లోనే 3 రాఫెల్ ఫైటర్స్.. వచ్చే నెలలో మరో 7 నుంచి 8 రాఫెల్స్ ఇండియాకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంటే, నెలరోజుల వ్యవధిలో దశలవారీగా 10 రాఫెల్ జెట్ ఫైటర్లు వాయుసేనలో చేరబోతోన్నాయి. ఇప్పటికే అంబాలాలోని 17 స్క్వాడ్రన్లో 11 రాఫెల్స్ ఉండగా.. ఈ తాజా రాఫెల్స్తో వీటి సంఖ్య 21కి చేరనుంది.
వీటి రాకతో గగనతల నిఘా మరింత పకడ్బందీగా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. భారత్-చైనా సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో.. గగనతల నిఘాను మరింత ముమ్మరం చేయడానికి రాఫెల్ జెట్ విమానాలు దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ మొదలుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు సుమారు మూడు వేల కిలోమీటర్ల మేర చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న రాష్ట్రాల్లో రాఫెల్ యుద్ధ విమానాలను మోహరింపజేస్తున్నారు.
2016లో ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రాఫెల్ జెట్స్ కోసం భారత్ ఆర్డర్ చేసింది. గతేడాది జులై-ఆగస్ట్ నుంచి దశలవారీగా ఇండియన్ ఎయిర్ఫోర్స్లోకి రాఫెల్స్ రావడం ప్రారంభించాయి. చైనాతో ఘర్షణ వాతావరణం సందర్భంగా ఈ రాఫెల్స్ను తూర్పు లఢాక్ ప్రాంతంలో పెట్రోలింగ్ కోసం ఉంచారు. తాజాగా రానున్న రాఫెల్ విమానాలు కూడా మొదట అంబాలాలోనే ఉండనున్నాయి.