సిద్బరి మఠంలో 154మంది సన్యాసులకు కరోనా
Himachal Pradesh హిమాచల్ ప్రదేశ్లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ధర్మశాల సమీపంలోని సిద్బరి పట్టణంలోని గైటో తాంత్రిక్ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
కాంగ్రా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గుర్దర్శన్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ…ఫిబ్రవరి 23న సిద్బరి మఠంలో పలు కోవిడ్ కేసులు వెలుగుచూడగా, తాజాగా మఠంలో టెస్టులు నిర్వహించగా 154 మంది సన్యాసులకి కొవిడ్-19 పాజిటివ్ గా తేలిందని తెలిపారు. వీరిలో ఒక సన్యాసి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. కరోనా పాజిటివ్గా తేలిన మిగిలిన వారిని మఠంలోనే ఐసొలేషన్ లో ఉంచుతామని తెలిపారు.
ఫిబ్రవరి-23న నమోదైనవాటితో కలుపుకొని ఇప్పటివరకు 330మంది సన్యాసులకు కరోనా పాజిటివ్ గా తేలిందని డాక్టర్ గుప్తా తెలిపారు. సిద్బరి మఠం పరిధిలోని ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించామని, ఈ ప్రాంతంలోకి ఏ ఒక్కరినీ అనుమతించడం లేదని,ఇక్కడివారిని బయటికెళ్లనీయడం లేదని తెలిపారు. కరోనా వైరస్ సోకిన సన్యాసుల్లో పలువురు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కర్ణాటక, ఢిల్లీలో ప్రయాణించారని డాక్టర్ గుప్తా తెలిపారు. మార్చి-5,2020నుంచే సిబ్దరి మఠంలోకి విజటర్స్ కి ప్రవేశం నిలిపివేయబడిందని తెలిపారు. కరోనా పాజిటివ్గా తేలిన సన్యాసుల్లో అత్యధికులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని చెప్పారు.