Fish Curry Murder : ఫిష్ కర్రీతో భార్యను ఫినిష్ చేసిన భర్త.. చేతికి మట్టి అంటకుండా పక్కా స్కెచ్.. సద్దాం హుస్సేనే స్ఫూర్తి

ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వరుణ్ అరోరా(37) దారుణానికి ఒడిగట్టాడు. చేపల కర్రీలో థాలియం(విష పదార్దం) కలిపి భార్య కుటుంబంపై హత్యాయత్నం చేశాడు. తన చేతికి మట్టి అంటకుండా పగ తీర్చుకునేందుకు విష ప్రయోగాన్ని ఎంచుకున్నాడు.

Fish Curry Murder : ఫిష్ కర్రీతో భార్యను ఫినిష్ చేసిన భర్త.. చేతికి మట్టి అంటకుండా పక్కా స్కెచ్.. సద్దాం హుస్సేనే స్ఫూర్తి

Fish Curry Murder

Man borrows from Saddam book : ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వరుణ్ అరోరా(37) దారుణానికి ఒడిగట్టాడు. చేపల కర్రీలో థాలియం(విష పదార్దం) కలిపి భార్య కుటుంబంపై హత్యాయత్నం చేశాడు. తన చేతికి మట్టి అంటకుండా పగ తీర్చుకునేందుకు విష ప్రయోగాన్ని ఎంచుకున్నాడు. థాలియం అనే కెమికల్ కలిపి ఫిష్ కర్రీ చేశాడు. థాలియం స్లో పాయిజన్ లా పని చేస్తుంది. భార్యకు ఆమె కుటుంబసభ్యులకు(భార్య తల్లిదండ్రులు, సోదరి) పెట్టాడు. చేపల కూరలో కలిసిన థాలియం మూడు నిండు ప్రాణాలను హరించింది. ఫిబ్రవరిలో వరుణ్ భార్య, ఆమె సోదరి చనిపోగా, గంగారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 21న వరుణ్ అరోరా అత్త మరణించారు. ఈ దారుణంపై పోలీసులు విచారణ చేయగా, సంచలన విషయాలు వెలుగుచూశాయి.

భార్య, ఆమె కుటుంబంపై పగ పెంచుకున్నాడు:
ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ లో వరుణ్ అరోరా నివాసం ఉంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన అరోరాకు భార్య, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. హాయిగా సాగిపోతున్న సంసారం, సంతోషకరమైన జీవితం. కానీ, ఆరేళ్ల క్రితం జరిగిన ఘటన వరుణ్ ని పీడ కలలా వెంటాడింది. ఆ బాధకు భార్య, ఆమె కుటుంబమే కారణం అన్నది వరుణ్ అరోరా ఉద్దేశం. ఆరేళ్లు అయినా వారి మీద అతడికి కోపం ఏమాత్రం తగ్గలేదు. పైగా కసి పెరిగింది. ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకున్నాడు. తనకు బాధ కలిగించేలా ప్రవర్తించిన భార్యను ఆమె తల్లిదండ్రులను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. కానీ, తానే హంతకుడు అనే విషయం బయటపడకుండా అత్యంత తెలివిగా వ్యవహరించాడు.

సద్దాం హుస్సేన్ పుస్తకమే మర్డర్ కు స్ఫూర్తి:
ఎలా చంపాలి అని ఆలోచిస్తుండగా, అతడికి ఇరాక్ దివంగత అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఓ పుస్తకం కనిపించింది. ప్రత్యర్థులపై థాలియం అనే విషపదార్ధం ఉపయోగించి మూడో కంటికి తెలియకుండా సద్దాం హుస్సేన్, అతడి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు.. రాజకీయ ప్రత్యర్థులను హతమార్చిన విషయం ఆ వ్యాపారిని ఆకర్షించింది. అంతే, దాని ఆధారంగా ప్రణాళిక రచించాడు. కరోనా కాలం అతడికి కలిసొచ్చింది. ప్రమాదకరమైన థాలియంను ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. హోమియోపతి డాక్టర్ అయిన తన మామతో కలిసి తాను కరోనా మందు తయారు చేస్తున్నానని అబద్దం చెప్పి ఆన్ లైన్ లో థాలియంను ఆర్డర్ చేశాడు.

థాలియంతో చేపల కూర వండాడు. ఆ కర్రీని తాను తినలేదు, పిల్లలకూ పెట్టలేదు. భార్య, మరదలు, అత్తమామలకు మాత్రమే వడ్డించాడు. జనవరిలో ఈ ఘటన జరిగింది. ఆ కూర తిన్న భార్య దివ్య, మరదలు ప్రియాంక, అత్త అనితా శర్మ, మామ దేవేందర్ మోహన్ శర్మ అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 15న భార్య, మరదలు చనిపోయారు. కొన్ని రోజుల క్రితం వరుణ్ అత్త అనితా దేవి కూడా మరణించింది.

ఆరేళ్ల క్రితం జరిగిన ఘటనతో పగ పెంచుకున్న వరుణ్:
కుటుంబాన్ని చంపాలని వరుణ్ అరోరా నిర్ణయం తీసుకోవడానికి వెనుక గల కారణం తెలుసుకుని పోలీసులు సైతం విస్తుపోయారు. ఆరేళ్ల క్రితం వరుణ్ తండ్రి చనిపోయాడు. అదే సమయంలో వరుణ్ భార్య గర్భం దాల్చింది. తన తండ్రి మళ్లీ కొడుకు రూపంలో తనకు పుట్టబోతున్నాడని వరుణ్ నమ్మాడు. కానీ, గర్భంలో సమస్యలు తలెత్తడంతో వరుణ్ భార్య అబార్షన్ చేయించుకున్నారు. ఆ అబార్షన్ వరుణ్ కు ఇష్టం లేదు. భార్య, అత్తింటి వారు తన మాట వినలేదనే కోపం ఏళ్లు గడిచినా అతడిని వెంటాడింది. ఇద్దరు కవల పిల్లలు పుట్టిన తర్వాత కూడా కోపం చల్లారలేదు. విచక్షణ మరిచి ఘాతుకానికి ఒడిగట్టాడు. మంగళవారం(మార్చి 23,2021) రాత్రి పోలీసులు వరుణ్ ని అరెస్ట్ చేశారు.

మామ ఫిర్యాదుతో వెలుగులోకి దారుణం:
వరుణ్ అరోరా మామ దేవేంద్ర మోహన్ శర్మ(62) ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గంగారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన భార్య అనితా శర్మ చనిపోవడం శర్మను షాక్ కి గురి చేసింది. వారు విష ప్రయోగం వల్ల చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో నిర్ధారణ అయ్యింది. దీంతో అల్లుడు వరుణ్ అరోరాపై మామకు అనుమానం వచ్చింది. తన భార్య, కూతుళ్ల చావుకి అతడే కారణం అని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మోహన్ శర్మ రక్తాన్ని ల్యాబ్ కి పంపారు. రక్తంలో విషపదార్థమైన థాలియం కనిపించడంతో షాక్ తిన్నారు. ఆ వెంటనే మోహన్ శర్మ భార్య అనితా శర్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె శరీరంలో అధిక మోతాదులో థాలియం ఉన్నట్టు గుర్తించారు.

రక్తంలో థాలియం:
ఆ తర్వాత వరుణ్ అరోరా భార్య సోదరి రక్తాన్ని సేకరించి ల్యాబ్ కి పంపారు. అందులోనూ థాలియం ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ ముందుకు విచారణకు రావాలని అరోరాని పిలిచారు. కానీ అతను రాలేదు. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి వరుణ్ అరోరా ఇంటిపై దాడి చేశారు. అతడి ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ ట్యాప్ ని ఓపెన్ చేసి చూడగా, థాలియంకు సంబంధించి అతడు సమాచారం సేకరించినట్టు బ్రౌజింగ్ హిస్టరీ ద్వారా తెలుసుకున్నారు.

ప్రతీకారం తీర్చుకునేందుకే:
వరుణ్ ఇంట్లో సోదా చేసిన పోలీసులు థాలియంను స్వాధీనం చేసుకున్నారు. దానిని కొనుగోలు చేసిన వివరాలను అతడి మొబైల్‌ నుంచి తెలుసుకున్నారు. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై తాను విషప్రయోగం చేసినట్లు వరుణ్‌ అంగీకరించాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేప కూరలో విషం కలిపి భార్య, ఆమె కుటుంబాన్ని చంపేందుకు అల్లుడు చేసిన కుట్ర సంచలనంగా మారింది.