శ్రామిక్ రైలు టికెట్ దొరకలేదనీ..సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని ఇంటికెళ్లిన వలస వాసి
లాక్డౌన్ రోజుకు ఎన్నిసార్లో ఆ మాట వింటున్నాం. జిల్లాలు..రాష్ట్రాలు..దేశాలు దాటి ఉద్యోగం నిమిత్తం..ఉపాధి కోసం..రెక్కల కష్టాన్ని నమ్ముకుని వెళ్లే బడుగు జీవులు ఇలా ఎంతోమంది లాక్ డౌన్ తో సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. కొంతమంది శ్రామిక్ రైళ్లలో వెళుతుంటే..కటిక పేదవారు మాత్రం కాలి నడకనే వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ఘజియాబాద్కు చెందిన చిత్రకారుడు పేంటర్ లల్లన్ తన స్వంత పట్టణం గోరఖ్పూర్కు వెళ్లేందుకు ఎడతెగని ప్రయత్నాలు చేశాడు. శ్రామిక్ రైలులో వెళ్లాలని ఎంతో ప్రయత్నించాడు. అలా మూడు నాలుగు రోజులపాటు అదే పనిమీద తిరిగాడు. కానీ పని అవ్వలేదు. దీంతో విసుగొచ్చేసింది. దీంతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కొని వెళ్లిపోదామని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లాడు.
బ్యాంకు ఖాతాలో ఉన్న 1.9 లక్షల డబ్బుని డ్రా చేశాడు. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే వ్యక్తి దగ్గరకెళ్లాడు. డ్రా చేసిన డబ్బు నుంచి 1.5 లక్షలు పెట్టి.. ఓ కారు కొన్నాడు. ఇక మళ్లీ వెనక్కు చూడని లల్లన్.. ఆ కారుతో గోరఖ్పూర్కు వెళ్లాడు.
లాక్డౌన్ తర్వాత పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని ఆశించిన లల్లన్ కు రోజు వస్తున్నవార్తలు..ఆర్థిక నిపుణులు విశ్లేషణలు విన్న అతనికి ఇక ఇప్పట్లో సాధారణ పరిస్థితులు రావని భావించాడు. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కానీ లాక్డౌన్ పొడిగిస్తుండడంతో.. స్వంత ఊరుకు వెళ్లడం బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చాడతను. బస్సు, రైళ్లలో సీట్ల కోసం ప్రయత్నించినా.. ఎటువంటి ప్రయోజనం జరగలేదని లల్లన్ అన్నాడు.
కిక్కిరిసిన బస్సుల్లో ఫ్యామిలీని తీసుకుని వెళ్లడం కష్టమని, ఆ సమయంలో సోషల్ డిస్టాన్సింగ్ కుదరదనుకున్నాడు. కారు ప్రయాణమే సేఫ్టీ అనుకున్నాడు. శ్రామిక్ రైలులోనూ టికెట్ దొరక్కపోవడం..తనకున్న కొద్దిపాటి ఆర్థిక స్థోమతను బట్టి సెకండ్ హ్యాండ్ కారు కొనాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. కాగా తనేమీ స్థితిమంతుడిని కాదనీ..ఉన్నంతలో పొదుపు చేసుకున్న డబ్బుతో సొంత ఊరికి చేరుకోవాలనే తపనతో తన సంపాదననంతా సెకండ్ హ్యాండ్ కారుకే పెట్టినా.. కనీసం తన ఫ్యామిలీ సురక్షితంగా ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
దాదాపు 14 గంటల ప్రయాణం తరువాత లల్లన్ ఫ్యామిలీ తన స్వంత ఊరుకు చేరుకుంది. ప్రస్తుతం హోం క్వారెంటైన్లో ఉన్న అతను.. ఇక గోరఖ్పూర్లోనే ఉండాలనుకుంటున్నాడు. ఒకవేళ ఏదైనా పనిదొరికితే ఇక్కడే ఉంటాను, లేదంటే మళ్లీ ఘజియాబాద్ వెళ్లొచ్చేమోనంటున్నాడు.