Omicron: చాపకింద నీరులా ఒమిక్రాన్.. భారత్లో ఒకేరోజు భారీగా పెరిగిన కేసులు
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో ఒకేరోజు 164 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
Omicron: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో ఒకేరోజు 164 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్లో ఒకే రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. తాజా పెరుగుదలతో Omicron మొత్తం కేసుల సంఖ్య 586కి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో నుంచి 151మంది కోలుకున్నారు.
పెరుగుతున్న కేసుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కరోనాకు సంబంధించి మార్గదర్శకాలను జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదే సమయంలో కేరళ, ఉత్తరాఖండ్, ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, కర్నాటక, గుజరాత్ మరియు అస్సాం రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించాయి.
ఇప్పటివరకు మొత్తం 21 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 63 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదవగా.. దేశరాజధానిలో మొత్తం కేసులు 142కి పెరిగాయి. అదేవిధంగా, మహారాష్ట్రలో 33, రాజస్థాన్లో 23, కేరళలో 19, గుజరాత్లో 6, తెలంగాణ, ఉత్తరాఖండ్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ఫస్ట్ కేసులు నమోదయ్యాయి.
ఏ రాష్ట్రంలో ఎన్ని ఒమిక్రాన్ కేసులు:
రాష్ట్రం – మొత్తం కేసులు – కోలుకున్నవారు
ఢిల్లీ – 142 – 23
మహారాష్ట్ర – 141 – 42
కేరళ – 57 – 1
గుజరాత్ – 49 – 10
తెలంగాణ – 43 – 10
రాజస్థాన్ – 43 – 30
తమిళనాడు- 34 – 0
కర్ణాటక – 31 – 15
మధ్యప్రదేశ్ 9 – 7
బెంగాల్ – 6 – 1
ఆంధ్రప్రదేశ్ – 6 – 1
హర్యానా – 4 – 2
ఒడిశా – 4 – 0
ఉత్తరాఖండ్ – 4 – 0
చండీగఢ్ – 3 – 2
జమ్మూ కాశ్మీర్ – 3 – 3
ఉత్తరప్రదేశ్ – 2 – 2
హిమాచల్ 1 – 1
లడఖ్ – 1 – 1
మణిపూర్ 1 – 1
గోవా 1-1