గణపతి సరెండర్ పోలీసుల కల్పిత కథ.. అంతా నాటకమే..!
మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలపై మావోయిస్టు కేంద్ర కమిటీ పార్టీ స్పందించింది. గణపతి సరెండర్ పోలీసుల కల్పిత కథ.. అంతా నాటకమని కొట్టిపారేసింది.. ఇదంతా హైటెంక్షన్ కల్పిత కథగా పేర్కొంది. గణపతి సరెండర్ వార్తలపై తొలిసారి స్పందించిన మావోయిస్టు కేంద్ర కమిటీ రెండు పేజీల లేఖను గురువారం విడుదల చేసింది.
గత మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో రెండు పేజీల లేఖ ద్వారా స్పందించింది. గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న నాటకమని తెలిపింది. తెలంగాణ, చత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ అధికారుల కట్టు కథలు, పోలీసులు అల్లిన నాటకంలో భాగమని లేఖలో పేర్కొంది. గణపతి అనారోగ్య కారణాలతో స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారని లేఖలో క్లారిటీ ఇచ్చింది.
కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నంత మాత్రానా ప్రజా సమస్యలపై గణపతి నిరంతరం పోరాటం చేస్తున్నాడని పేర్కొంది. తమ నాయకత్వపు ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని మండిపడింది. ఈ కట్టుకథలపై మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వాల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నామని పేర్కొంది.
ఎన్ని ఆటంకాలు ఎదురైన తమ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తామని లేఖలో స్పష్టం చేసింది. అనారోగ్య సమస్యలతో బాధపతుడున్న గణపతి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.