Cipla Moderna Vaccine : గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్కు మోడెర్నా వ్యాక్సిన్
త్వరలోనే భారత్ లోకి మరో కరోనా వ్యాక్సిన్ రానుంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతి కోసం
Cipla Moderna Vaccine : త్వరలోనే భారత్ లోకి మరో కరోనా వ్యాక్సిన్ రానుంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతి కోసం మల్టీ నేషనల్ ఫార్మాసూటికల్ కంపెనీ సిప్లా.. సోమవారమే.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ-డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. దీనిపై కేంద్రం ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత్ లో ఇప్పటికే సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కు చెందిన కొవ్యాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్ అందుబాటులో ఉన్నాయి.
మోడెర్నా టీకాను mRNA టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఇది 90శాతానికిపైగా సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. ఇప్పటికే చాలా ధనిక దేశాల్లో ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించింది. దీంతో పాటు ఫైజర్ టీకా కూడా అమెరికా, బ్రిటన్ దేశాల్లో అందుబాటులో ఉంది. అమెరికాలో ఫైజర్, మోడెర్నా కలిపి ఇప్పటివరకూ 12కోట్ల మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు అధిక ధర, ఉత్పత్తి పరిమితులు, స్టోరేజీ, షిప్పింగ్ సమస్యలు వంటివి ఉండటం ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అడ్డంకిగా మారింది.
భారత్లోనూ మోడెర్నా, ఫైజర్ టీకాలను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవల డీసీజీఐ అనుమతి ప్రక్రియల్లో కొన్ని మార్పులు చేసింది. విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలు దేశంలో క్లినికల్ ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం లేదంది. అయితే విదేశీ కంపెనీలు డిమాండ్ చేస్తున్న ఇండెమ్నిటీ రక్షణపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో వీటి రాక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.