మోడీ వెంట తెచ్చిన బ్లాక్ బాక్స్ లో ఏముంది : కర్ణాటక కాంగ్రెస్ డిమాండ్ 

  • Published By: chvmurthy ,Published On : April 14, 2019 / 12:11 PM IST
మోడీ వెంట తెచ్చిన బ్లాక్ బాక్స్ లో ఏముంది : కర్ణాటక కాంగ్రెస్ డిమాండ్ 

బెంగుళూరు: ప్రధానమంత్రి  మోడీ ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గకు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మోడీ వచ్చిన హెలికాప్టర్ లోంచి నలుపు రంగుతో ఉన్న ఒక ట్రంకు పెట్టెను ముగ్గురు వ్యక్తులు ఒక ప్రయివేటు వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఇదంతా కెమెరా కంటికి చిక్కింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ పై ముప్పేట దాడి మొదలుపెట్టింది. మోడీ తెచ్చిన పెట్టెలో ఏముందో బయట పెట్టాలని ఎలక్షన్ కమీషన్ ను డిమాండ్ చేస్తోంది. 

వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలికాప్టర్ వెంట మరో 3 హెలికాప్టర్లు ఎస్కార్ట్ గా వస్తుంటాయి. ప్రధాని భద్రత ఎస్పీజీ కమోండోలు చూసుకుంటారు. అయితే మోడీ వచ్చిన హెలికాప్టర్లో ఉన్న నల్లరంగు ట్రంక్ పెట్టె మాత్రం ప్రధాని పర్యటనతో నిమిత్తం లేకుండా వేరే ప్రైవేటు వాహనంలో వెళ్ళటం పట్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల సంఘం అన్ని పార్టీల వాహానాలను తనిఖీలు చేస్తున్నారు. మరి పీఎం వెంట తెచ్చిన నల్లరంగు ట్రంకుపెట్టెలో ఏముందో బయట పెట్టాలని డిమాండ్ చేసింది.