Priyanka Gandhi : జిమ్మేదార్ కౌన్..కేంద్రం కోవిడ్ లెక్కలపై ప్రియాంక ఫైర్
మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ.
Priyanka Gandhi మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. కొవిడ్ వివరాలను వెల్లడించడంలో కేంద్రం పారదర్శకంగా వ్యవహరించట్లేదని, కరోనాకి సంబంధించిన లెక్కలను కేంద్రం గుట్టుగా ఉంచుతోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఓ ట్వీట్ చేశారు.
కోవిడ్ సంబంధించి పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్న సైంటిస్టులు, నిపుణుల సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కరోనా వైరస్ కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నా..ప్రభుత్వం మాత్రం ప్రధాన మంత్రి ప్రతిష్ఠను కాపాడుకోవడమే ప్రధానంగా భావిస్తోంది. వైరస్ ప్రారంభం నుంచి కూడా కరోనా వివరాలను ప్రభుత్వం తమ ప్రచారానికి తగిన విధంగా ఉపయోగించుకుంటోంది. మృతులు, పాజిటివ్ కేసులను జనాభా నిష్పత్తి ప్రకారం వెల్లడిస్తూ.. టెస్టింగ్ వివరాలు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా లేదని ప్రజలను నమ్మించే ప్రయత్నమే ఇదంతా. వాస్తవానికి పరిస్థితి భిన్నంగా ఉంది. వ్యాక్సిన్ పంపిణీ లెక్కల విషయంలోనూ కేంద్రం ఇదే వైఖరి ప్రదర్శిస్తోంది. ఈ వైఖరి తీరని నష్టాన్ని కలిగించిందని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.