Odisha : పోలీసులకు లొంగిపోయిన 150 మంది మావోయిస్టు సానుభూతి పరులు
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు కంచుకోట అయిన కటాఫ్ ఏరియాలో సుమారు 150 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులు ముందు లొంగిపోయారు.
Odisha : ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు కంచుకోట అయిన కటాఫ్ ఏరియాలో సుమారు 150 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులు ముందు లొంగిపోయారు. ఏవోబీలోని చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాళ్లగెడ్డ పంచాయతీ పరిధిలో మావోయిస్టు సానుభూతిపరులు మల్కన్గిరి ఎస్పీ నితీష్ వాధ్వానీ, బీఎస్ఎఫ్ డీఐజీ ఎస్కే సిన్ ముందులొంగిపోయారు.
సోమవారం జాన్బాయిలో బీఎస్ఎఫ్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లొంగిపోయిన మిలీషియా సభ్యులను పోలీసులు విలేకరులకు చూపించారు. కటాఫ్ ఏరియాలో అభివృద్ది పనులు చూసి జనజీవన స్రవంతిలోకి చేరాలనుకున్నట్లు మావోయిస్టు సానుభూతిపరులు చెప్పారు. ఇటీవల కటాఫ్ ఏరియాలో లొంగిపోయిన కొంతమంది మావోయిస్టు మిలీషియా సభ్యులు తమకు లొంగిపోయేలా ప్రోత్సహించారని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా లొంగిపోయిన వారు … మావోయిస్టు దుస్తులను తగులబెట్టి, మావోయిస్టు స్మారక స్ధూపాలను ధ్వంసం చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా మిలీషియా సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్బంగా లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులకుమల్కన్గిరి జిల్లా ఎస్పీ నితీష్ వాద్వానీ క్రీడాసామాగ్రిని పంపిణీ చేశారు.
ఆంధ్ర సరిహద్దుకు సమీపంలోని ఉన్న జాన్ బాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కేవలం సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో జరిగిన మావోయిస్టు మిలిషియా సభ్యుల లొంగుబాటు ఒరిస్సా తో పాటు ఆంధ్ర సరిహద్దులోని మావోయిస్టుల ప్రాబల్యం పై భారీ ఎత్తున ప్రభావం చూపించి మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే పరిస్థితి ఏజెన్సీలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : Covid-19 : తెలంగాణలో కొత్తగా 345 కోవిడ్ కేసులు నమోదు