భారత్ లో ఒక్క రోజే 6వేలకు పైగా కరోనా కేసులు…తగ్గిన మరణాల రేటు

  • Published By: venkaiahnaidu ,Published On : May 22, 2020 / 12:43 PM IST
భారత్ లో ఒక్క రోజే 6వేలకు పైగా కరోనా కేసులు…తగ్గిన మరణాల రేటు

భారత్ లో కరోనా మరణాల రేటు తగ్గినట్లు ఇవాళ(మే-22,2020) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ…కోవిడ్-19 మరణాల రేటులో మెరుగుదల కన్పించిందని, మరణాల రేటు 3.13శాతం నుంచి 3.2శాతానికి తగ్గినట్లు తెలిపారు. కవరీ రేటు కూడా 41శాతానికి మెరుగుపడిందని తెలిపారు. గడిచిన 24గంటల్లో 3,234మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు.

దీంతో ఇప్పటివరకు మొత్తం 48,534మంది కోలుకున్నట్లు తెలిపారు. 3,583మంది మరణించినట్లు చెప్పారు. ఏప్రిల్-3నుంచి కోవిడ్-19 కేసుల వృద్ధిరేటు క్రమంగా తగ్గుతున్నట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. లాక్ డౌన్ కారణంగా కేసుల వృద్ధి తగ్గినట్లు తెలిపారు. లాక్ డౌన్ ను కనుక ఒకవేళ అమలుచేయకపోయినట్లయితే కేసుల సంఖ్య ఇప్పటికి భారీగా ఉండి ఉండేదని ఆయన అన్నారు.  

ఇక గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 6వేల88కొత్త కేసులు నమోదైనట్లు అగర్వాల్ చెప్పారు. దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 1.18లక్షలకు చేరుకున్నట్లు చెప్పారు. అత్యధికంగా మహారాష్ట్రలో దాదాపు 42వేల కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. దేశంలోని కోవిడ్-19 కేసుల్లో 35శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదైనట్లు చెప్పారు.

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR)తెలిపిన ప్రకారం…శుక్రవారం మధ్యాహ్నాం 1గంట వరకు దేశవ్యాప్తంగా 27లక్షల 55వేల 714మందికి టెస్ట్ లు చేశారు. గడిచిన 24గంటల్లో 1లక్ష 3వేల 829మందికి టెస్ట్ లు చేశారు.18,287టెస్ట్ లు ప్రేవేటు ల్యాబ్ లలో జరిగాయి. గడిచిన నాలుగు రోజులుగా రోజుకి 1లక్షమందికి పైగా టెస్ట్ లు చేస్తున్నారు.