సూట్ బూట్ బడ్జెట్…వాళ్లతోనే మోడీ సంప్రదింపులు

  • Published By: venkaiahnaidu ,Published On : January 10, 2020 / 10:05 AM IST
సూట్ బూట్ బడ్జెట్…వాళ్లతోనే మోడీ సంప్రదింపులు

తన సన్నిహిత పెట్టుబడిదారీ మిత్రులతోనే బడ్జెట్‌ పై ప్రధాని మోడీ సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.  రైతులు, విద్యార్థులు, మహిళలతో కాకుండా కేవలం కేవలం క్రోనీ క్యాపటలిస్టులు, బడా పారిశ్రామిక వేత్తలతోనే బడ్జెట్‌పై మోడీ సంప్రదింపులు జరుపుతారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

రైతులు, చిన్నవ్యాపారులు, విద్యార్ధులు, ఉద్యోగుల అభిప్రాయాలతో ప్రధాని మోడీకి అవసరం లేదని సూట్‌బూట్‌సర్కార్‌ హ్యాష్‌ట్యాగ్‌తో రాహుల్‌ ట్వీట్‌ చేశారు. తన సన్నిహిత బడా పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకొనే మోడీ సమావేశాలు నిర్వహిస్తారని, మధ్య తరగతి, రైతులను దృష్టిలో పెట్టుకోరని రాహుల్ మండిపడ్డారు.

వార్షిక బడ్జెట్‌కు ముందు ఆనవాయితీగా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, ఆర్థిక వేత్తలతో పాటు ఇతర రంగాల ప్రముఖులతో ప్రధాని గురువారం ఓ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. సుమారు రెండు గంటల పాటు నీతి ఆయోగ్ అధికారులతో సహా 40 మంది ప్రముఖులతో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్‌పై, దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై మోడీ పారిశ్రామిక వేత్తల నుంచి సలహాలు స్వీకరించారు. అయితే ఇంతటి కీలక సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకాలేదు.