భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ : స్కూళ్లకు సెలవు
భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలు, రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు ముందస్తు అప్రమత్తతను ప్రకటించింది సర్కార్. ముంబై, రాయ్ గడ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడిస్తూ..రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాణిజ్య నగరమైన ముంబై వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాబోయే 48 గంటల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలను మూసివేశారు. ముంబై, థానే, కొంకణ్ ప్రాంతాల్లో స్కూళ్లు తెరుచుకోలేదు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆశీష్ షెలార్ ట్వీట్ చేశారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వార్డు అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని బీఎంసీ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముంబై శివారు ప్రాంతాల్లో సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వెర్సోవాలో మూడు గంటల్లో 50 మి.మీటర్ల వర్షపాతం నమోదైందని ముంబైలోని IMD డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. పాల్గర్, థానేలలో భారీ వర్షాలు కురిశాయన్నారు. రుతుపవనాలు ప్రవేశిండమే ఆలస్యం..ముంబైలో కుండపోతగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. భారీ వర్షాల వల్ల ముంబై అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Read More : నకిలీ నోట్ల కలకలం : రూ.4కోట్ల ఫేక్ కరెన్సీ పట్టివేత