సిక్కు సోదరుడికి అంత్యక్రియలు పూర్తి చేసిన ముస్లింలు
కరోనా వైరస్ నేపథ్యంలో ఆప్తులు ఎవరూ రాకపోవడంతో సిక్కు వ్యక్తి అంత్యక్రియలను ముస్లింలే నిర్వహించారు. జమ్మూ అండ్ కశ్మీర్ లోని గాంధర్బాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పంజాబ్ కు చెందిన రణవీర్ సింగ్ అనే వ్యక్తి వకురా ప్రాంతంలో కార్పెంటర్ గా పనిచేసేవాడు. తన సహోద్యోగులతో కలిసి 35కిలోమీటర్ల దూరంలో అద్దెకు ఉంటున్నాడు.
చనిపోయినట్లు తెలియగానే సమాచారాన్ని పోలీసులకు అందించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సివిల్, పోలీసుల సమక్షంలో పూర్తి చేసినట్లు గులాం మొహమ్మద్ భట్ తెలిపారు. స్థానికులు ప్రతీది ఏర్పాటు చేయడంలో చాలా సపోర్ట్ అందించారు. దానికి అయ్యే ఖర్చులు కూడా వారే భరించారు. సింగ్ భార్య అకౌంట్లోనూ కొంచెం డబ్బు డిపాజిట్ చేశారు.
స్థానికుడైన అబ్దుల్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ఇరుగుపొరుగుల వారికి సాయం చేయడం మన విధి. చాలా మంది చలికాలం రాగానే ఇక్కడ నుంచి వెళ్లిపోతారు. కొద్ది నెలల తర్వాత మళ్లీ ఇక్కడకు వస్తారు. సమాజంలో ఒకరిగా వారూ కలిసిపోయారు. వారికి ఏదైనా సమస్య వస్తే సాయం చేయడానికి ముందుంటాం. సింగ్ చనిపోయినట్లు తెలిసి అంత్యక్రియలు పూర్తి చేశాం’ అని వెల్లడించారు.