మహా కూటమిలో చిచ్చు పెట్టిన పేర్ల మార్పు!
name change row ఔరంగాబాద్తో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చాలంటూ శివసేన చేసిన ప్రతిపాదనతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. శివసేన ప్రతిపాదనను మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ వ్యతిరేకించాయి. దీంతో మహా వికాస్ అఘాడీలో చీలిక ఏర్పడినట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. కూటమిలోని పార్టీలకు పడటం లేదని పుకార్లు బయటకువచ్చాయి. అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మూడు పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయనేది ఉత్కంఠగా మారింది.
మొదట ఔరంగాబాద్ తో ఈ పేర్ల మార్పు వ్యవహారం మొదలైంది. ఇప్పటివరకు ఉన్న ఆ పేరును సంభాజీనగర్గా మార్చాలని శివసేన ప్రతిపాదించింది. ఇది పార్టీ వ్యవస్థాపకుడు బాల్ఠాక్రే కలగా అభివర్ణించింది. శివసేన ప్రతిపాదనను కాంగ్రెస్,ఎన్సీపీ వ్యతిరేకించాయి. ఇలా పేర్లు మార్చే ప్రక్రియకు తాము వ్యతిరేకమని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ తేల్చిచెప్పారు. ఈ ప్రతిపాదనను 20ఏళ్ల క్రితమే తిరస్కరించామని.. ఇప్పుడూ అదే చేస్తామని కూటమిలో మరో పార్టీ అయిన ఎన్సీపీ కూడా శివసేన నిర్ణయంతో విభేదించింది. ఇక, సమాజ్వాదీ పార్టీ కూడా శివసేనకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పనులతో ప్రజల మధ్య మధ్య చిచ్చుపెట్టొదని హితవు పలికింది.
అయితే, ఔరంగాబాద్ పురపాలక ఎన్నికల వేళ శివసేన ఈ ప్రతిపాదన చేసిందని.. ఓట్ల కోసం ప్రజల మనోభావాలపై రాజకీయం చేస్తోందని ప్రతిపక్ష బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు, ఇవేవీ లెక్క చేయని శివసేన.. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల పేర్లను మార్చేందుకు రెడీ అవుతోంది. ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ను ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ గా, పుణెను జిజాపుర్ గా, ముంబై సెంట్రల్ ను నానా శంకర్సేఠ్ స్టేషన్గా పేరు మార్చాలని యోచిస్తోంది.
ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ పేరు మార్చాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాయడం గమనార్హం. ఔరంగాబాద్ లోని చిక్హల్తనా ఏరియాలోని ఉన్న ఎయిర్పోర్ట్ పేరును ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ గా మార్చేందుకు రాష్ట్ర అసెంబ్లీ,మండలి ఏకగ్రీవ తీర్మాణం చేసిందని ఆ లేఖలో సీఎం ఠాక్రే పేర్కొన్నారు.