ఉసురు తీస్తున్న కాలుష్యం..నియంత్రణకు చర్యలేవీ?

  • Published By: nagamani ,Published On : December 2, 2020 / 01:25 PM IST
ఉసురు తీస్తున్న కాలుష్యం..నియంత్రణకు చర్యలేవీ?

National Pollution Control Day 2020 : కాలుష్యం..కాలుష్యం..కాలుష్యం. మనిషి ప్రాణాల్ని సైలెంట్ గా తీసేస్తుంది.మనకు ఏం జరిగిందో తెలుసుకునేలోపే మన ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి. అంత ప్రమాదకరంగా మారుతోంది కాలుష్యం. కాలుష్య కాటుకు ప్రతీ సంవత్సరం 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ హెల్త్ పోర్టల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కాలుష్యం అనేది గాలి, నీరు, నేల, శబ్దం వంటి పలు కాలుష్యాలు మనిషి ప్రాణాల్ని మెల్లగా హరించేస్తున్నాయి.



గాలి, నీరు, నేల, శబ్దం వంటి పలు కాలుష్యాల గురించి ప్రజలకు అవగాహన కలిగించటానికి..పారిశ్రామిక విపత్తులను ఎలా నియంత్రించాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేయటానికి ఈ జాతీయ కాలుష్య నియంత్రణ దినంగా గుర్తించబడింది. డిసెంబర్ 2 న కాలుష్య నివారణ దినంగా జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా పది మందిలో తొమ్మిది మందికి శుభ్రమైన, సురక్షితమైన గాలి అందుబాటులో లేదని తేలింది.



మన దేశంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన 10 నగరాల జాబితాలో 9 భారతీయ నగరాలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో చలికాలంలో శ్వాసకోస వ్యాధులతో ఆస్పత్రులకు వచ్చే చిన్న పిల్లల సంఖ్య ఏటా పెరుగుతోందని తేలింది అంటే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు.



దేశంలో అన్ని రాష్ర్టాల్లో వాయు కాలుష్య పరిస్థితి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే ఎన్నో రెట్లు హీనంగా ఉన్నట్లు ప్రపంచ ప్రఖ్యాత వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్‌ 2017లో తన పరిశోధనలో తెలిపింది. దీని ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలోనే 12.5 లక్షలమంది వాయు కాలుష్యానికి బలయ్యారు. కాలుష్య మరణాలు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్లో అత్యధికంగా ఉన్నాయని తెలియజేసింది. చికాగో యూనివర్శిటీ నివేదిక ప్రకారంగా చూస్తే..భారతీయ పౌరుని సగటు ఆయుర్దాయం దీర్ఘ కాలం పాటు కాలుష్యానికి గురి కావటం వలన నాలుగేళ్లు తగ్గిపోతోందని తేలింది. గత అక్టోబర్‌ నెలలో అమెరికాకు చెందిన హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రకారం 2019లో వాయు కాలుష్య మృతుల సంఖ్య 17లక్షలకు చేరుకుంది.



గత నవంబర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వెలువరించిన తాజా నివేదికలో ప్యారిస్‌ ఒప్పందంలో పేర్కొన్న కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరుకోలేకపోయిన ప్రపంచంలో పది నగరాల్లో మనదేశంలో తొమ్మిది ఉన్నాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా గాలి, నీరు, శబ్ద కాలుష్యంలో భారతదేశం అత్యంత తీవ్రస్థాయిలో ఉందని తెలిపింది.ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన చైనా కూడా కాలుష్య నివారణ గురించి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల చైనా తీసుకున్న కాలుష్య నివారణ చర్యలు గత ఐదారు ఏళ్లలోనే కాలుష్య తీవ్రత 30 శాతం తగ్గించుకుంది. ఒకప్పుడు డిల్లీ కంటే అధ్వానంగా ఉన్న బీజింగ్‌, మెక్సికో నగరాలు ఇప్పుడు ఎంతగానో మెరుగుపడ్డాయి.


దేశంలో మొత్తం వాయు కాలుష్యంలో 51శాతం పారిశ్రామిక కాలుష్యం, 27శాతం వాహన కాలుష్యం, 17 శాతం వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల కలిగే కాలుష్యం, 5 శాతం బాణసంచా కాల్చడం లాంటివి చాలా ముఖ్యమైనవి.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జాబితా ప్రకారమే 65 రకాల ప్రమాదకర, అతి ప్రమాదకర పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు వెదజల్లే రసాయన వాయు, నీటి కాలుష్యాల వలన వ్యవసాయ భూమి పనికిరాకుండా పోతున్నది. దేశంలో ఐఎల్‌ఓ అంచనా ప్రకా రం.. ఏటా వృత్తి సంబంధిత వ్యాధుల వలన 4.5 లక్షల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.



భారత ప్రభుత్వం 40 సంవత్సరాల క్రితమే 1981లో వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తరువాత కూడా పలు కాలుష్యసంబంధిత చట్టాలు వచ్చాయి. ఎన్ని చట్టాలు చేసినా కాలుష్యం తగ్గిన సూచనలు మాత్రం కనిపించటం లేదు. దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పాటు ప్రజల అలసత్వం కూడా కారనంగా కనిపిస్తోంది.



2020 పర్యావరణ పనితీరు సూచికలో ప్రపంచంలోని 180 దేశాలలో భారతదేశం 168వ స్థానంలో ఉందని ఏల్‌, కొలంబియా విశ్వవిద్యాలయాల పరిశోధకులు తేల్చారు. పర్యావరణ చట్టాలు అమలు చేయటంలో పాలకులకు చిత్తశుద్ధి లేకపోవటం..అవినీతి, బంధుప్రీతి వంటి ఎన్నో కారణాలున్నాయి. వీటి వల్ల కాలుష్యం పెరగటం అందరిమీదా ప్రభావం చూపిస్తోంది.



దీనిపై ప్రభుత్వాలు చిత్తశుద్దితో వ్వయహరించకపోతే..అది ఏ ఒక్కరిమీదో కాదు ప్రజలంతా కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నారు. చట్టాలను ఉల్లంఘించిన సంస్థలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. కాలుష్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలి. ఈ చర్యలన్నీ ప్రభుత్వం అమలు చేసినప్పుడు మాత్రమే కాలుష్యం తగ్గుతుంది. మన ఆశించిన ఫలితాలు వస్తాయి. తద్వారా ప్రజలు ఆరోగ్యం బాగుంటుంది.