2 లక్షల మంది అభిప్రాయం తీసుకున్నాకే కొత్త విద్యావిధానం తెచ్చాం
కొత్త విద్యావిధానం(NEP-2020)పై ఇవాళ గవర్నర్లతో, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కలిసి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. కేవలం చదువుకోవడమే కాదు నేర్చుకోవడంపైన కొత్త విద్యావిధానం ఫోకస్ చేసినట్లు ప్రధాని తెలిపారు. విద్యార్థుల్లో సృజన్మాతక ఆలోచనలు కలిగించే విధంగా నూతన విద్యావిధానం ఉంటుందన్నారు. భవిష్యత్తు తరాలకు అవసరమైన రీతిలో వారిని తీర్చిదిద్దుతుందన్నారు. ఈ కొత్త విధానంలో తాము ప్యాషన్, ప్రాక్టికాలిటీ, పర్ఫార్మెన్స్పై దృష్టిపెట్టినట్లు ప్రధాని చెప్పారు.
సమాచారం, విజ్ఞానం మరింత సరళతరం అయ్యిందని మోడీ అన్నారు. ప్రస్తుతం కొన్ని వీడియోల ద్వారా సమాచారం ఎంత వేగంగా వెళుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందనే విషయాన్ని పేర్కొన్నారు. టెక్నికల్, వొకేషనల్ అన్ని విద్యా విధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చామని మోడీ తెలిపారు. కొత్త విద్యా విధానం కోసం 2 లక్షల మంది నుంచి అభిప్రాయం తీసుకున్నామన్నారు. విధానం రూపొందించడానికి 5 ఏళ్ల సమయం పట్టిందని చెప్పారు.
https://10tv.in/new-warning-over-rare-coronavirus-symptom-after-nurse-tests-positive/
దేశ ఆకాంక్ష నెరవేర్చడం కోసం విద్యా విధానం ముఖ్య సాధనం అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలు అన్నీ విద్యావ్యవస్థ బాధ్యతలను చూసుకోవాలన్నారు. కానీ ప్రభుత్వాల జోక్యం విద్యావిధానంలో తక్కువగా ఉండాలన్న అభిప్రాయాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. టీచర్లు, పేరెంట్స్.. విద్యా విధానానికి కనెక్ట్ అయి ఉంటే, అప్పుడు విద్యార్థులు కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారన్నారు. ఆ నేపథ్యంలో విద్యా వ్యవస్థ సమగ్రత కూడా పెరుగుతుందన్నారు.
విద్యా ప్రమాణాలు పెరగడంతో.. అంతర్జాతీయ యవనికపై భారత్ సత్తా చాటుతోందని మోడీ అభిప్రాయపడ్డారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కూడా దీంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.నాలెడ్జ్ ఎకానమీగా భారత్ను తీర్చిదిద్దేందుకు కొత్త విద్యావిధానం దోహదపడుతుందని ప్రధాని తెలిపారు. బ్రెయిన్ డ్రెయిన్ వలసలను ఎదుర్కోవాలంటే, సాధారణ ప్రజల స్వప్నాలు నిజం కావాలంటే, భారత్లో ప్రపంచ మేటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. మేటి విద్యా సంస్థలను నెలకొల్పితే.. విద్యార్థులు విదేశాలకు వెళ్లరు అని, మన వర్సిటీల్లోనూ పోటీతత్వం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.