Uttarakhand CM : చిరిగిన జీన్స్ చూసి షాక్ అయ్యా..యువతి వస్త్రధారణపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
Netizens react on Uttarakhand CM’s comment over women in ripped jeans : యువతుల వస్త్రధారణపై నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా..ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసిందని, ఈ వేషధారణతో ప్రజలను కలవడానికి వెళితే..సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నట్లు అంటూ ఆయన ప్రశ్నించడం కలకలం రేపుతోంది. దీనిపై నెటిజన్లు ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు. డెహ్రాడూన్ లో రాష్ట్ర పిల్లల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన వర్క్ షాపులో పాల్గొన్న ఈయన..ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మన పిల్లలకు ఏం సంకేతాలిస్తున్నట్లు? ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. మనం ఏం చేస్తామో పిల్లులూ అదే చేస్తారు. మనం దేనిని ఫాలో అవుతామో… పిల్లలూ అదే ఫాలో అవుతారు. ఇళ్లలో సంస్కృతి మూలాలను నేర్పించినట్లైతే, ఎంత ఆధునికంగా ఉన్నా పర్లేదు. జీవితంలో ఎన్నడూ వైఫల్యం చెందరు.’ అని సీఎం తీరథ్ రావత్ వెల్లడించారు. యువతీ యువకులు మోకాళ్లను చూపుతూ ఉండే జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అని పేర్కొన్నారు.
దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తమకు నచ్చిన దుస్తులను మహిళలు ధరించవచ్చని, భారతదేశం స్వేచ్చాయుత యువ దేశ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్ను బీజేపీ శాసన సభాపక్షం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా పని చేసిన త్రివేంద్ర సింగ్ రావత్.. తన పదవికి రాజీనామా చేశారు. సింగ్ ప్రస్తుతం ఎంపీగా పని చేస్తున్నారు. 2013-15 మధ్య ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్గా వ్యవహరించారు. గతంలో ఎమ్మెల్యేగానూ ఆయన పని చేశారు. ఉత్తరాఖండ్ తొలి విద్యాశాఖ మంత్రి తీరథ్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. మరుసటి ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు.
ఉత్తరాఖండ్లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2017 ఎన్నికల్లో 57 స్థానాల్లో బీజేపీ గెలవగా.. కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఉత్తరాఖండ్కు పదో సీఎం ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్.