Covid-19 Guidelines : రెమ్‌డెసివిర్‌ అవసరం లేదు, స్టెరాయిడ్లు వద్దు, కోవిడ్ టెస్ట్ అక్కర్లేదు.. కరోనా రోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

మధ్యస్థాయి లేదా అసలు లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి మందులు వాడాలి? ఏ మందులు అవసరం లేదు? ఇంట్లో వాళ్లకి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Covid-19 Guidelines : రెమ్‌డెసివిర్‌ అవసరం లేదు, స్టెరాయిడ్లు వద్దు, కోవిడ్ టెస్ట్ అక్కర్లేదు.. కరోనా రోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Covid 19 Guidelines

Covid-19 Guidelines : మధ్యస్థాయి లేదా అసలు లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతూ హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారికి సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇదివరకు జారీచేసిన మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేసి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. గతేడాది(2020) జూలై 2 తర్వాత వీటిని సవరించడం ఇదే తొలిసారి. కరోనా బారిన పడిన వారిలో లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందడం మంచిదని కేంద్రం సూచించింది. పరీక్షల్లో పాజిటివ్ గా తేలి ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండా 94శాతానికి పైగా ఆక్సిజన్ స్తాయి ఉన్నవారిని లక్షణాలు లేని కరోనా బాధితుల కిందకి వస్తారు.

శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు లేనప్పట్టికి, కేవలం జ్వరం, జలుబు, గొంతులో ఇబ్బందులు మాత్రమే ఉండి 94శాతానికి పైగా ఆక్సిజన్ స్థాయి ఉన్నవారు స్వల్ప లక్షణాలు ఉన్నవారి పరిధిలోకి వస్తారు. హోం ఐసోలేషన్ లో ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం, మెడిసిన్ సహా ఇంట్లో ఉన్న ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది కేంద్రం.

కరోనా రోగులకు కేంద్రం మార్గదర్శకాలు:
* ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న మధ్యస్థాయి/లక్షణాలు లేని వారు రెమ్ డెసివిర్‌ ఔషధాన్ని వాడొద్దు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న రోగులు మాత్రమే దీన్ని తీసుకోవాలి.
* నోటి ద్వారా ఎలాంటి స్టెరాయిడ్లు తీసుకోకూడదు. ఏడు రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం, దగ్గు ఉంటే వైద్యుల సూచనల మేరకే కొంత మోతాదులో వీటిని వాడాలి.
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు ఉన్నవాళ్లు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాళ్లు చికిత్స తీసుకోవాలి.

* రోగులు గోరు వెచ్చని నీటిని పుక్కిలించడం చేయాలి. రోజుకు కనీసం రెండుసార్లు ఆవిరి పట్టాలి.
* పారాసిటమాల్‌ 650 ఎంజీ రోజుకు నాలుగు సార్లు వేసుకున్నప్పటికీ, జ్వరం తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
* రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి నాన్‌-స్టెరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్‌-ఎన్‌ఎస్‌ఏఐడీ (ఉదాహరణకు రోజుకు రెండుసార్లు నాప్రోక్సెన్‌ 250 ఎంజీ)ను వైద్యులు సూచించవచ్చు.
* అలాగే, ఐవర్‌మెక్‌టిన్‌ (ఖాళీ కడుపుతో వేసుకునేది) ట్యాబ్లెట్లను 3 నుంచి 5 రోజులు వాడేందుకు అనుమతి ఇవ్వొచ్చు.

* ఐదు రోజుల పాటు జ్వరం, దగ్గు ఉంటే ఇన్‌హెలేషనల్‌ బ్యూడెసనైడ్‌ (ఇన్‌హేలర్‌ ద్వారా తీసుకునే మందు) ను రోజుకు రెండుసార్లు వైద్యులు సూచించవచ్చు.
* కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేకపోవడం, 94 శాతానికి పైన ఆక్సిజన్‌ స్థాయిలు ఉండటం, జ్వరం వంటివి లేకపోతే వారిని లక్షణాలు లేనివారిగా గుర్తించాలి. వైద్యుల సూచన మేరకు వాళ్లు మందులు వేసుకోవాలి. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి.
* మధ్య స్థాయి లక్షణాలు కలిగిన వారు, లక్షణాలు లేని వారు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు వాడొచ్చు. హోం ఐసోలేషన్‌లో ప్రత్యేకంగా కేటాయించిన గదిలో ఉండటం మేలు. కుటుంబ సభ్యులకు ముఖ్యంగా వృద్ధులకు దూరంగా ఉండాలి.

* హోంఐసోలేషన్‌లో ఉన్నవారు గదిలో గాలి, వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. మాస్క్‌ ధరించే ఉండాలి.
* హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం అందించే వ్యక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఇరువురూ ఎన్‌-95 మాస్క్‌ ధరిస్తే మంచిది.
* రోగి వాడిన మాస్క్‌లను సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంలో శుద్ధి చేసిన తర్వాతే పారేయాలి.
* కరోనా బారిన పడినవారు వీలైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. శరీరం తేమను కోల్పోకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వారు వినియోగించిన వస్తువులను ఇతరులు వాడొద్దు.
* హోంఐసోలేషన్‌ వ్యవధి పూర్తయిన తర్వాత ఇంకోసారి కరోనా పరీక్షలు అవసరం లేదు.