భారత్ కొత్త చరిత్ర..ఆరు రోజుల్లో 10 లక్షల మందికి కరోనా టీకా
Corona vaccine for 10 lakh people : కరోనా వ్యాక్సినేషన్లో ఇండియా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన దేశంగా భారత్ నిలిచింది. ఆరురోజుల్లో 10 లక్షల మందికి కరోనా టీకా ఇచ్చిన తొలి దేశంగా భారత్ అవతరించింది. దేశవ్యాప్తంగా నిన్నటితో ఆరవ రోజు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. టీకా డ్రైవ్ ప్రారంభం రోజు జనవరి 16 నుంచి నిన్నటి వరకు 10 లక్షల 40 వేల 14 మందికి భారత్ వ్యాక్సిన్ వేసింది. దీంతో కొత్త రికార్డులను నెలకొల్పింది.
ఈ నెల 16న మొదలైన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ రోజు నుంచి ఇమ్యునైజేషన్ తర్వాత 187 ప్రతికూల సంఘటనలు నమోదైనట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల టీకా తీసుకున్న వాళ్లు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బందిపడినప్పటికీ.. ఎక్కువమందికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ నమోదుకాకపోవడం అందరికీ ఊరట కలిగిస్తోంది.
కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన తొలి దేశంగా నిలిచినట్లు రష్యా గతంలో ప్రకటించుకుంది. అంతేకాకుండా అత్యవసర వినియోగం కింద టీకా పంపిణీని చేపడుతోంది. అయితే.. ప్రజల నుంచి ఆశించినంత స్పందనను పొందడంలో మాత్రం విఫలమయ్యింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న 27 దేశాల ఈయూలోనూ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
అయితే.. అక్కడి టీకా పంపిణీ కాస్త మందకొడిగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ లాంటి దేశాల్లో టీకా తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి కనబరచడం లేదని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ సరఫరాలో ఆలస్యం, ఏర్పాట్లతో పాటు ప్రజలను ముందస్తుగా మానసికంగా సిద్ధం చేయడంలో చాలాదేశాలు విఫలమయ్యాయి.
వ్యాక్సినేషన్ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో టీకాలు ఎప్పుడూ ఏ దేశం కూడా వేయలేదు. భారత్లో టీకా పంపిణీ ప్రపంచానికే పాఠాలు నెర్పుతోంది. భారత్ కన్నా ముందే చాలా దేశాలు వ్యాక్సిన్ పంపిణీని చేపట్టాయి. అమెరికా వంటి ధనిక దేశాలు భారీస్థాయిలో టీకాలను నిల్వ చేసుకున్నాయి. కానీ.. ఊహించని పరిణామాలు, ప్రజల విముఖత, రవాణా సమస్యల కారణంగా పంపిణీలో మాత్రం వెనకబడ్డాయి.
అలాంటి ఇబ్బందులు ముందుగానే పసిగట్టిన భారత్, పటిష్ట ప్రణాళికతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ముందుగా వ్యాక్సిన్ ఎవరికి, ఎంత మందికి ఇవ్వాలనే అంశాలపై స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. ఇప్పటివరకు టీకా పంపిణీ ప్రారంభించిన ఏ దేశం కూడా భారత్ మాదిరిగా ఇలాంటి ప్రణాళికతో ముందుకెళ్లలేదు. అందుకే వ్యాక్సినేషన్లో భారత్ దూసుకెళ్తోంది.