NGT Fine Bihar Govt : బీహార్ ప్రభుత్వానికి రూ.4వేల కోట్ల జరిమానా .. రెండు నెలల్లో చెల్లించాలని ఆదేశం
బీహార్ ప్రభుత్వం అలసత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రూ.4,000 కోట్ల జరిమానా కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంది నితీశ్ కుమార్ ప్రభుత్వం.
NGT Fine Bihar Govt : బిహార్ (Bihar) ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) నితీశ్ కుమార్ ప్రభుత్వానికి భారీ షాకిచ్చింది. రూ.4,000కోట్ల జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణను సరిగా చేపట్టనందుకు గానూ.. రెండు నెలల్లో రూ.4వేల కోట్లను చెల్లించాలని శుక్రవారం (మే5,2023)ఆదేశించింది.
ఘన, ద్రవరూప వ్యర్థాల శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించటంలో విఫలమైనందుకు రూ.4,000 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని రెండు నెలల్లోగా రింగ్ ఫెన్స్డ్ అకౌంట్ (ring-fenced account)లో (అత్యవసర పరిస్థితుల్లో నిధులను సంరక్షించేందుకు ఉపయోగించే ఖాతాలు) జమ చేయాలని ఆదేశించింది. జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి, నిపుణులైన సభ్యులు అప్రోజ్ అహ్మద్,ఎ సెంథిల్ వేల్ తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
వ్యర్థాల నిర్వహణ (waste management)లో బీహార్ ప్రభుత్వం అలసత్వం వహించటంపై NGT తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని..సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ తీర్పుల ప్రకారం ఇది చట్టాల ఉల్లంఘనే అని పేర్కొంది. ఈ అలసత్వానికి ప్రభుత్వానికి రూ.4వేల కోట్ల పర్యావరణ పరిహారాన్ని విధిస్తున్నామని పేర్కొంది.
కాగా ring-fenced account రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటుంది. సీఎస్ ఆదేశాల మేరకు ఈ ఖాతాలోని నగదును వ్యర్థాల నిర్వహణకు మాత్రమే వినియోగించాలని ఎన్జీటీ (NGT) ఛైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం నీతీశ్ కుమార్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పరిహారంగా జమ అయిన నగదుతో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ సదుపాయాలు, మురుగు నీటి నిర్వహణ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.
కాగా..వ్యర్థాల నిర్వహణ (waste management)లో విఫలమైనందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ ఇలా భారీ మొత్తంలో జరిమానా విధించింది.బెంగాల్ ప్రభుత్వానికి రూ.3500కోట్ల పరిహారం కట్టాలని ఆదేశించింది. అలాగే ఇటీవల పంజాబ్లోని లూథియానాలో చోటుచేసుకున్న విషవాయువుల ఘటనకు వలస కుటుంబాల్లో 11 మంది మృతిచెందారు. దీనిపై గ్రీన్ ట్రైబ్యునల్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనను సుమోటాగా తీసుకున్న ఎన్జీటీ.. దర్యాప్తునకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే గత మార్చి (2023)లో కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల జరిమానా విధించింది. బ్రహ్మపురం వ్యర్ధాల శుద్ధి కర్మాగారం (Brahmapuram garbage)లో జరిగిన అగ్నిప్రమాదం (fire incident)మున్సిపల్ నిర్లక్ష్యంతోనే జరిగిందని పేర్కొంటు ఈ జరిమానా విధించింది.