Nirbhay Cruise Missile డీఆర్డీవో(Defence Research and Development Organisation)అభివృద్ధి చేసిన నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ ని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. 1000 కి.మీ రేంజ్ గల ఈ మిసైల్ ని బుధవారం ఉదయం 9:55 గంటల సమయంలో ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ టెస్టింగ్ ఫెసిలిటీ నుంచి ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాన్ని..క్షిపణి ఖచ్చితమైన సమయంలోనే ఛేదించినట్లు డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. స్వదేశీ క్రూయిజ్ ఇంజిన్తో క్షిపణి దాదాపు 150 కిలోమీటర్ల దూరం వెళ్లింది.
అయితే ఈ మిసైల్ ని ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ కోసం.. యూజర్ ట్రయల్ ముందు మిషన్ మోడ్లో తదుపరి టెస్ట్ ఫైరింగ్ జరుగుతుందని ఒక ఉన్నతాధికారి చెప్పారు. కాగా, గతేడాది అక్టోబర్ లో నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగం ఫెయిల్ అయిన విషయం తెలిసిందే.
ఈ మిసైల్ ప్రత్యేకలు
నిర్భయ్…0.7 నుండి 0.9 మాక్ వేగంతో ఎగిరే ఒక సబ్సోనిక్ క్షిపణి. శత్రు రాడార్ కళ్లకు కనబడకుండా ఉండే సముద్రంలో మరియు భూభాగం మీద ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. దీనిని సముద్రం, భూమి మరియు మొబైల్ లాంచర్ల ద్వారా ప్రయోగించవచ్చు. ఇది రెండు దశల క్షిపణి.. మొదటి దశలో ఘన ఇంధనాన్ని మరియు రెండవది ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. ఇది 300 కేజీల బరువు కలిగిన కన్వెన్షన్ వార్హెడ్ను కలిగి ఉంది మరియు 1500 కిమీ పరిధి వరకు టార్గెట్ లను చేధించగలదు.
మరికొన్ని టెస్ట్ ల తర్వాత ఈ మిసైల్ ని ఆర్మీకి అందించనున్నారు. తూర్పు లడఖ్ లోని వివిధ ప్రదేశాల్లో భారత్-చైనా సైనిక ప్రతిష్ఠంభణ కొనసాగుతున్న నేపథ్యంలో..ఈ మిసైల్స్ ఆర్మీలో చేరిన తర్వాత వీటిని ఎల్ఏసీ వద్ద మొహరించనున్నారు.