ఏడోసారి బీహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్

  • Published By: venkaiahnaidu ,Published On : November 16, 2020 / 05:00 PM IST
ఏడోసారి బీహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్

Nitish Kumar:ఏడోసారి బీహార్ సీఎంగా ఇవాళ(నవంబర్-16,2020)నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ పఘు చౌహాన్ నితీష్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. వరుసగా నాలుగోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేయగా… బీహార్ డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు తారకిశోర్ ప్రసాద్,రేణు దేవి ప్రమాణస్వీకారం చేశారు. రాజధాని పాట్నాలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.

జేడీయూ నేతలు విజయ్ కుమార్ చౌదరి,విజయేంద్ర ప్రసాద్ యాదవ్,అశోక్ చౌదరి,మేవా లాల్ చౌదరి, బేజేపీ నేతలు మంగల్ పాండే,అమరేంద్ర ప్రతాప్ సింగ్,హెచ్ఏఎమ్ పార్టీ చీఫ్ జితన్ రామ్ మాంజీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్,వీఐపీ పార్టీ నేత ముఖేష్ సాహ్ని బీహార్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.



కాగా,ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి 126 సీట్లు సాధించడంతో నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టారు.అయితే,తాజా ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీ అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం నితీష్ నే సీఎంగా కొనసాగించాలని ఎన్డీయే నిర్ణయించడంతో ఆయన వరుసగా నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.