గుడిలోకి నో ఎంట్రీ… ఒడిషా గవర్నర్ కు చేదు అనుభవం

గుడిలోకి నో ఎంట్రీ… ఒడిషా గవర్నర్ కు చేదు అనుభవం

No Covid report, Odisha governor turns back from Jagannath Temple ఒడిశా గవర్నర్​ గణేశీ లాల్​కు పూరీ జగన్నాథుని సన్నిధిలో అనూహ్య అనుభవం ఎదురైంది. ఆదివారం పూరీ జగన్నాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన ఒడిశా గవర్నర్ గణేశీ లాల్​.. కరోనా నెగటివ్​ రిపోర్టు సమర్పించని కారణంగా గుడి లోపలకు వెళ్లకుండానే వెనుదిరిగాల్సి వచ్చింది. ఆలయం సింహ ద్వారం నుంచే స్వామి దర్శనం చేసుకుని ఆయన తిరిగి రాజ్​భవన్​కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్​ రిపోర్టు సమర్పించని కారణంగానే ఆలయం నుంచి ఆయన వెనుదిరగాల్సి వచ్చినట్లు తెలిపారు.

కరోనా కారణంగా నెలలపాటు మూతపడిన పూరీ జగన్నాథుని ఆలయం ఇటీవలే తిరిగి తెరుచుకున్న విషయం తెలిసిందే. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా రిపోర్ట్​ సమర్పించాల్సి ఉంటుందని అధికారులు షరతు విధించారు. అయితే టెస్టు చేయించుకోకుండానే గవర్నర్​ ఆలయానికి వచ్చారు. రిపోర్టు లేదని గవర్నర్​ను ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించగా… అధికారులు అలాంటిదేం లేదని సమాధానమిచ్చారు. గణేశీ లాల్​ నిబంధనలను గౌరవిస్తూ.. తనంతట తాను వెనుదిరిగారని తెలిపారు.

మరోవైపు,ఆదివారం ఒక్కరోజే కరోనా నెగిటివ్ రిపోర్టు సమర్పించని కారణంగా దాదాపు 3వేల మంది భక్తులు గుడిలోకి వెళ్లలేకపోయినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి కూడా కరోనానెగిటివ్ రిపోర్టు లేని కారణంగా గుడిలోకి వెళ్లకుండానే వెనుదిరగాల్సివచ్చినట్లు తెలిపారు. అయితే మధ్యాహ్నానానికి టెస్ట్ రిపోర్టు సమర్పించి ఆయన గుడిలోకి వెళ్లి జగన్నాధుడి దర్శనం చేసుకోగలిగారని తెలిపారు.