Insurance : మద్యం తాగి మరణిస్తే ఇన్సురెన్స్ రాదు, సుప్రీంకోర్టు కీలక తీర్పు

బీమా(Insurance) చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అతిగా మద్యం తాగి చనిపోతే బాధిత కుటుంబానికి బీమా చెల్లించాల్సిన అవసరం లేదంది.

Insurance : మద్యం తాగి మరణిస్తే ఇన్సురెన్స్ రాదు, సుప్రీంకోర్టు కీలక తీర్పు

No Insurance Claim If Death Due To Alcohol Consumption

No Insurance Claim : బీమా(Insurance) చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మందుబాబులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే, అతిగా మద్యం తాగి చనిపోతే బాధిత కుటుంబానికి బీమా(ఇన్సురెన్స్) పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప ఇతర ఏ సందర్భంలోనూ బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టమైన తీర్పు చెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ ఎం.ఎం. శాంతన్‌గౌండర్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 1997లో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి చనిపోయిన కేసులో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార సంఘం ఇచ్చిన తీర్పును అత్యున్నత కోర్టు సమర్థించింది.

కేసు వివరాల్లోకి వెళితే.. సిమ్లా జిల్లాలోని చోపాల్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో(HPSFC-హిమాచల్ స్టేట్ ఫారెస్ట్ కార్పొరేషన్) చౌకీదారుగా(వాచ్ మెన్) పనిచేస్తున్న వ్యక్తి 1997లో(అక్టోబర్ 8న) మరణించాడు. అతిగా వర్షాలు కురవడం, విపరీతమైన చలి కారణంగానే అతడు మరణించాడని అధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, అతడు అతిగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని పోస్టుమార్టంలో తేలింది. అతడు ప్రమాదంలో మరణించ లేదు కాబట్టి పరిహారం చెల్లించేందుకు బీమా సంస్థ నిరాకరించింది.

దీంతో బాధిత కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో బీమా కంపెనీ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. విచారించిన ఫోరం బీమా.. కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, అటవీ సంస్థ మాత్రం పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఈ తీర్పును అటవీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రెండూ సంస్థలకూ(అటవీ సంస్థ, ఇన్సురెన్స్ కంపెనీ) లేదని తెలిపింది.

హిమాచల్ అటవీ సంస్థలో 3వేల 8 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారందరికి జనతా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద బీమా చేశారు. ఈ స్కీమ్ కింద.. ఏదైనా ప్రమాదంలో చనిపోతే బాధిత కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం ఇస్తారు. ఈ మేరకు హిమాటల అటవీ సంస్థ.. న్యూ ఇండియా అసురెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది.

కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అతిగా మద్యం సేవించే మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్సురెన్స్ చేయించాం, ఇంకేం భయం లేదు, పరిహారం వచ్చేస్తుందిలే అని అనుకుంటే పొరపాటు అవుతుంది. అతిగా మద్యం తాగి చనిపోయినట్టు నివేదికలో తేలితే.. ఇన్సురెన్స్ చేయించుకున్నా పరిహారం మాత్రం అందే అవకాశం లేకుండా పోతుంది. సో, మందుబాబులు కొంత కేర్ ఫుల్ గా ఉండటమే బెటర్ ఏమో.