No Remdesivir : పిల్లలకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ వద్దు, కరోనా చికిత్స మార్గదర్శకాలు
చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్(డీజీహెచ్ఎస్) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
No Remdesivir : థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్(డీజీహెచ్ఎస్) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ చికిత్సలో భాగంగా పెద్దలకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే, కొవిడ్ చికిత్సలో పిల్లలకు రెమ్ డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. అంతేకాదు, తప్పనిసరి అయితేనే సీటీ స్కాన్ చేయాలంది.
లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కరోనా కేసుల్లో స్టెరాయిడ్ల వాడకం హానికరమని హెచ్చరించింది. ఆసుపత్రిలో చేరిన వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉన్న బాధితులకే స్టెరాయిడ్లు ఇవ్వొచ్చని సూచించారు. అదీ సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలోనే ఇవ్వాలన్నారు. సరైన సమయంలో, సరైన డోసు, సరైన కాల వ్యవధిలోనే స్టెరాయిడ్లు ఇవ్వాలని తెలిపారు.
కరోనా మహమ్మారి పిల్లల్లోనూ ప్రభావం చూపిస్తోంది. చిన్నారులు సైతం వైరస్ బారినపడుతున్నారు. అయితే, వారిలో లక్షణాలు అంతగా కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో ఈ గైడ్ లైన్స్ విడుదల చేశారు.
డీజీహెచ్ఎస్ మార్గదర్శకాలు:
* 18 ఏళ్లలోపు వారికి రెమ్డెసివిర్ వాడకం, అది చూపించే ప్రభావం, భద్రతపై ఇప్పటిదాకా పూర్తి సమాచారం అందుబాటులో లేదు. అందుకే వారికి కరోనా చికిత్సలో రెమ్డెసివిర్ను సూచించడం లేదు.
* అధిక తీవ్రత కలిగిన సీటీ (హెచ్ఆర్సీటీ) స్కాన్ వాడకంలో హేతుబద్ధత అవసరం.
* కొవిడ్-19 అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీని నియంత్రణలో యాంటీమైక్రోబయల్స్ ఉపయోగం పెద్దగా ఉండదు.
* లక్షణాలు, తక్కువ తీవ్రత కలిగిన కేసుల్లో యాంటీమైక్రోబయల్స్ అవసరం లేదు.
* పిల్లలకు కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోతే ప్రత్యేకంగా చికిత్స ఏదీ అక్కర్లేదు. వారికి బలవర్థకమైన ఆహారం, పోషకాహారం అందజేయాలి.
* మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం వంటివి చేయాలి.
* స్వల్పంగా లక్షణాలు ఉంటే పారాసెటమాల్ మాత్రలు ప్రతి 4-6 గంటలకోసారి ఇవ్వాలి. దగ్గు ఉంటే సిరప్ వాడొచ్చు.
* ఇన్ఫెక్షన్ కొంత ఎక్కువ మోతాదులో ఉంటే వెంటనే ఆక్సిజన్ చికిత్స ప్రారంభించాలి.
* స్వల్ప మోతాదులో ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలకు కార్టికోస్టెరాయిడ్లు ఇవ్వొద్దు.
* ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉంటేనే యాంటీమైక్రోబయల్స్ ప్రయత్నించవచ్చు.
* 12ఏళ్లు దాటి కరోనా సోకిన పిల్లల వేలికి పల్స్ ఆక్సీమీటర్ అమర్చి, ఆరు నిమిషాలపాటు నడిపించాలి. వారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం ఏ మేరకు ఉందన్నది దీని ద్వారా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి చికిత్స చేయొచ్చు.