వలస కూలీలకు అన్నం పెట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి

  • Published By: chvmurthy ,Published On : March 31, 2020 / 05:53 AM IST
వలస కూలీలకు అన్నం పెట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే రోజు వారి కూలీలు, వలస కార్మికులు వీధిన పడ్డారు.  సొంత ఊళ్లకు వెళ్లలేక ఉన్నచోట  ఆహరం దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలో నేను సైతం అంటూ  సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం వారికి తోచిన సహయం వారు అందిస్తున్నారు.  భారత తదుపరి  ప్రధాన న్యాయమూర్తిగా భావిస్తున్న  జస్టిస్ ఎన్.వీ.రమణ  ప్రధాన మంత్రి సహాయనిధితో పాటు, ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి  ఒక్కో లక్ష రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు.  

వీరికంటే ఒక అడుగు ముందడుగు వేసి మరొక సుప్ర్రీం కోర్టు న్యాయమూర్తి ఎస్.రవీంద్ర భట్ ఆదివారం మార్చి 29 నాడు ఢిల్లీ వీధుల్లోని వలస కూలీలకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది  కరోనై వైరస్ వ్యాధిని ఎదుర్కోటానికి ఏర్పాటు చేసిన పీఎం కేర్ ఫండ్ కి  కోటి రూపాయలు విరాళం అందచేసి లాక్ డౌన్ వల్ల ప్రభావితమైన బలహీన వర్గాల వారికి అండగా నిలిచారు.

ప్రతి న్యాయమూర్తి తమ జీతాల్లోంచి 10 వేల రూపాయలను పీఏం కేర్ ఫండ్ కు విరాళంగా అందిస్తారని  ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది.  సుప్రీం కోర్టు, ఢిల్లీ  హై కోర్టుకు చెందిన సబార్డినేట్ సిబ్బంది కూడాల ఒకరోజు జీతాన్ని స్వచ్చందంగా అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పాటిస్తూ …. తగిన రక్షణ చర్యలు తీసుకుని సామాజిక దూరాన్ని పాటించాలని జస్టిస్ రమణ ప్రజలకు పిలుపునిచ్చారు.

లాక్ డౌన్  విధించేసరికి వేలాది మంది వలసదారులు ఢిల్లీ వీధుల్లో ఆహరంలేక…సొంతూళ్లకు వెళ్లలేకు అల్లాడి పోయారు. అలాంటి వారికి భట్ ఆహారాన్ని అందించి సహయ పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి తమ,తమ ఊళ్లకు వచ్చేవారు  తప్పని సరిగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనన్న నిబంధనను పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.