స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, లైంగిక వేధింపులు కావు – బాంబే హైకోర్టు

స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, లైంగిక వేధింపులు కావు – బాంబే హైకోర్టు

Skin To Skin Contact : ఒకడి వయసు 39 ఏళ్లు….పొరుగింట్లో ఉన్న పన్నెండేళ్ల బాలికకు ఓ పండు ఇస్తానని పిలిచాడు. నిజమేనని చెప్పి బాలిక అతని ఇంటికి వెళ్లింది. తన వయసు, వివేకం, విచక్షణ మర్చిపోయి అతడు బాలికను అసభ్యంగా తాకాడు. దుస్తులు తొలగించబోయాడు. అతడు చేసిన, చేయబోయే దుర్మార్గం తెలుసుకునే వయసు లేకపోయినా….ఏదో జరుగుతోందని గ్రహించి ఆ చిన్నారి ప్రతిఘటించింది. పెద్దగా కేకలు వేసింది. ఆ అరుపులు విన్న తల్లి పరుగు పరుగున వచ్చి బాలికను రక్షించింది. ఆ కామాంధుడు చేసింది నేరమా….కాదా…..?

సమాజం దృష్టిలో అయితే అది పెద్ద నేరం. సమాజం అతన్ని నేరస్థుడిగానే చూస్తుంది. అతని పరువు పోతుంది. కానీ చట్టం దృష్టిలో మాత్రం అతను చేసింది కాదు. అతను బాలిక దుస్తులు తీయలేదు కాబట్టి..ఆమెను దుస్తులపై నుంచే పట్టుకున్నాడు కాబట్టి…పోక్సో చట్టం కింద అది లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు అంటోంది. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

నేరస్థుడు బాలిక దుస్తులు తొలగించలేదు కాబట్టి…అతనికి, బాలికకు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదు కాబట్టి… సెషన్స్ కోర్టు నేరస్థుడికి విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఎత్తివేస్తూ తీర్పు ప్రకటించారు. పోక్సో చట్టంలోని ఐపీసీ సెక్షన్ 354 కింద విధించిన ఒక సంవత్సరం జైలు శిక్షను మాత్రం కొనసాగించారు న్యాయమూర్తి. బాంబే హైకోర్టు తీర్పుతో యావత్ సమాజం ఉలిక్కి పడింది. జనవరి 19న ఈ తీర్పు వెలువడగా…తీర్పు పూర్తి పాఠం ఆలస్యంగా అందుబాటులోకొచ్చింది. ఈ తీర్పుపై అనేకమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే పోక్సో చట్టానికి సవరణలు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.

2016లో నాగ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 39ఏళ్ల సతీశ్ అనే కామాంధుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 2016 డిసెంబరులో సెషన్స్ కోర్టు సతీశ్ నేరాన్ని నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్ష, ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిపై అతను బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.