రోడ్డుపైకి వచ్చి మమత ఏం చేసిందో చూడండి

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2020 / 04:15 PM IST
రోడ్డుపైకి వచ్చి మమత ఏం చేసిందో చూడండి

దేశంలో కరోనా వైరస్‌(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్‌ ప్రకటించినా.. కొన్ని చోట్ల ఇంకా గుంపులు గుంపులుగా జనం వచ్చి చేరుతున్నారు.

ఏదో ఒక సాకుతో రోడ్లపై జనం తిరుగుతూనే ఉన్నారు. అయితే కొందరి కారణాలు సరైనవే కానీ మరికొందరు ఊరకనే ఖాళీగా ఉన్న రోడ్లను చూద్దామని రోడ్లపై తిరుగుతున్నారు.దీంతో సామాజిక దూరంపై అవగాహన కల్పించేందుకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. కూరగాయల మార్కెట్లో ఓ ఇటుకరాయి తీసుకొని, స్వయంగా సామాజిక దూరం పాటించేలా కొలతలతో సర్కిల్‌ గీసి ప్రజలకు అవగాహన కల్పించారు.

కరోనా నేప‌థ్యంలో ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించేందుకు మ‌మ‌తా గురువారం(మార్చి-26,2020)రాజధాని కోల్‌క‌తా వీధుల్లో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె అధికారుల‌తో క‌లిసి కోల్‌ క‌తాలోని ఒక కూరగాయ‌ల మార్కెట్ కు చేరుకున్నారు. అక్క‌డ కూర‌గాయ‌లు అమ్ముతున్న‌ వ్యాపారులకు, ప్రజలకు క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా సామాజిక దూరం ఎలా పాటించాల‌నే దానిపై ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంతరం స్వయంగా ఇటుక రాయితో వృత్తాలను గీసి దానిలో మాత్రమే నిలబడాలని సూచించారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్  పోస్టు చేశారు.  అంతేకాకుండా ‘‘నో వర్డ్స్‘  అంటూ ఈ వీడియోను ఉద్దేశించి ఓబ్రెయిన్ కామెంట్ పెట్టారు.  కాగా, బెంగాల్‌లో ఇప్పటి వరకు తొమ్మిది కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి ఒకరు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా 694 కరోనా కేసులు నమోదుకాగా, 16 మంది మరణించారు.

Also Read | సరైన దిశలో తొలి అడుగు…ఆర్థిక ప్యాకేజీపై రాహుల్