Chirag Paswan : హనుమను చంపుతున్నా రాముడి మౌనమా!
లోక్జనశక్తి పార్టీ(LJP)లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ మౌనం వహించడంపై చిరాగ్ పాశ్వాన్ హర్ట్ అయ్యారు.
Chirag Paswan లోక్జనశక్తి పార్టీ(LJP)లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ మౌనం వహించడంపై చిరాగ్ పాశ్వాన్ హర్ట్ అయ్యారు. ఎల్జేపీలో చీలికతో ఉక్కిరిబిక్కరవుతున్న చిరాగ్ పాశ్వాన్ బుధవారం ప్రధాని నరేంద్రమోదీపై తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. హనుమంతుడిని చంపుతుంటే రాముడు మౌనంగా ఉండటం సరికాదని చిరాగ్ వ్యాఖ్యానించారు.
సత్యయుగం నుంచి నేటి వరకు రామాయణంలో మనం చూస్తున్నాం. రాముడి ప్రతి నిర్ణయానికి హనుమంతుడు బాసటగా నిలుస్తూ వచ్చాడు. రాముడి అడుగులో అడుగు వేసి నడిచాడు. లోక్జనశక్తి పార్టీ చేసింది కూడా అదే. నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిచ్చింది. మోదీకి హనుమంతుడిలా నేను ప్రతిసారి మద్దతుగా నిలిచినా.. నేను కష్టంలో ఉన్నప్పుడు మోదీ స్పందించకపోవడం బాధిస్తున్నది అని చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి తాను నమ్మినబంటును అని.. మోదీ రాముడైతే తాను హనుమంతుడినని చిరాగ్ చెప్పుకున్న విషయం తెలిసిందే.
కాగా, చిరాగ్ బాబాయ్ పరాస్ తిరుగుబాటుతో ఎల్జేపీలో చీలిక వచ్చిన విషయం తెలిసిందే. లోక్సభలో ఎల్జేపీ పక్షనేత హోదా నుంచి, పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా చిరాగ్ పాశ్వాన్ తొలగించారు. ఎల్జేపీ లోక్ సభ అధ్యక్షుడిగా మరియు ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిగా పరాస్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక,ఎల్జేపీలో చీలికకు బీహార్ సీఎం నితీష్ కుమార్ కారణమంటూ చిరాగ్ ఆరోపణలు చేయగా..సీఎం నితీష్ ఆ ఆరోపణలను ఖండించారు. పబ్లిసిటీ కోసమే చిరాగ్ ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నట్లు నితీష్ తెలిపారు.