సిద్దూ పెంచిన చిలుకను కాను..హైకమాండ్ దయతోనే సీఎం అయ్యా

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2019 / 10:44 AM IST
సిద్దూ పెంచిన చిలుకను కాను..హైకమాండ్ దయతోనే సీఎం అయ్యా

కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య-కుమారస్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సిద్దరామయ్య దయ వల్లే తాను సీఎం అయ్యానని కొందరు అంటున్నారని…అయితే తాను కాంగ్రెస్ హైకమాండ్ దయ వల్లే సీఎం అయ్యాను తప్ప సిద్దరామయ్య వల్ల కాదని కుమారస్వామి అన్నారు. తాను సిద్ధరామయ్య ఇంట్లో పెంచిన చిలుకను కాదన్నారు. సిద్ధరామయ్య దయ వల్ల సీఎంను అయ్యానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మాజీ ప్రధాని దేవేగౌడ వద్ద ఎంతో మంది కాలం వెల్లదీశారని, కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పినట్లు విని ఉంటే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం సుస్థిరంగా ఉండేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ప్రాంతీయంగా కొంత శక్తిని ఏర్పర్చుకున్నాను. ప్రాంతీయంగా శక్తిని ఏర్పర్చుకునే దమ్ము సిద్ధరామయ్యకు ఉందా? అని కుమారస్వామి ప్రశ్నించారు. లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఓటమికి రాష్ట్ర నాయకత్వం సరిగ్గా లేకపోవడమే కారణమని కుమారస్వామి అన్నారు.